
శామీర్ పేట, వెలుగు: తూంకుంట మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సభ్యులు రాకపోగా వాయిదా పడింది. మేడ్చల్ కలెక్టర్ గురువారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ఏర్పాట్లు చేశారు. ముందు నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేసిన 1 వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ పూజా భరత్ సింగ్ తీరా సమయానికి కనిపించకుండా పోయారు.
దీంతో కౌన్సిలర్ తీరును మిగతా కౌన్సిలర్లు తప్పుబట్టారు. బీఆర్ఎస్ సొంత పార్టీ లీడర్లే అవిశ్వాసానికి మద్దతు తెలుపుతుండగా.. కాంగ్రెస్లో ఉన్న ఇద్దరు కౌన్సిలర్లలో ఒకరు ఇలా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను పూజా భరత్ సింగ్ నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫొటోలతో ఊరేగింపు చేపట్టారు. అవిశ్వాసం పేరుతో డబ్బులు దండుకొని పూజా భరత్ సింగ్ మోసం చేశారని నాలుగో వార్డ్ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు.
మొదటి నుంచి అవిశ్వాసానికి మద్దతు పలికి ప్రతిపక్ష పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రెండు వర్గాల వారికి పూర్తిస్థాయి బలం లేక ఇరువర్గాల వారు హాజరు కాలేదు. దీంతో అవిశ్వాస పరీక్షను వాయిదా వేసినట్లు మల్కాజిగిరి ఆర్డీవో శ్యాంప్రకాశ్ తెలిపారు. పూర్తి నివేదికను కలెక్టర్ కు అందిస్తామన్నారు. ఫిర్యాదు మేరకు పూజా భరత్ సింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి తెలిపారు.