ఎవరెన్ని కుట్రలు చేసినా మోదీ అనుకున్నది సాధించారు : లక్ష్మణ్

ఎవరెన్ని కుట్రలు చేసినా మోదీ అనుకున్నది సాధించారు : లక్ష్మణ్

మహబూబ్​నగర్, వెలుగు : నవ భారత నిర్మాణంలో భాగంగా నూతన పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లు మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలుపడం చరిత్రాత్మకమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్  లక్ష్మణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘనత బీజేపీ ప్రభుత్వానిదని చెప్పారు. కాంగ్రెస్  పార్టీతో సహా ఇతర ప్రతిపక్షాలు ఈ బిల్లును సమర్థిస్తూనే ఏదో ఒకరకంగా బిల్లును అడ్డుకునే కుట్ర చేశాయని విమర్శించారు. ఓబీసీలపై కాంగ్రెస్  నేత రాహుల్ గాంధీ ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా మోదీ అనుకున్నది సాధించారన్నారు. 

మహబూబ్ నగర్  జిల్లా కేంద్రంలో అక్టోబరు 1న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మంగళవారం పార్టీ లీడర్లు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు తొలి దశ తెలంగాణ ఉద్యమ నాయకురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె ఫొటోకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో లక్ష్మణ్  మాట్లాడారు. 2010లో యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ మహిళా బిల్లు ప్రవేశపెట్టారని, రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత లోక్ సభలో యూపీఏ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే ఆ బిల్లును అడ్డుకున్నాయని ఆయన గుర్తుచేశారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్  ప్రభుత్వం.. తన మిత్ర పక్షాలను నిలువరించే ప్రయత్నం చేయకుండా బిల్లు పాస్ కావడానికి చొరవ తీసుకోలేదని మండిపడ్డారు.

 ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ అమలు, పెద్దనోట్ల రద్దు దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలన్నారు. అందుకే దేశ ప్రజలు ‘మోదీ హైతో ముమ్ కీన్ హై’ (మోదీ ఉంటే సాధ్యమే)  అని నినదిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్  రెడ్డి, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, రాష్ర్ట కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, జాతీయ బీసీ కమిషన్  మాజీ సభ్యుడు ఆచారి, నాగూరావు నామాజీ, లీడర్లు బాలాత్రిపుర సుందరి, డోకూరు పవన్  కుమార్   రెడ్డి, సుదర్శన్  రెడ్డి, నర్సింహులు, సతీశ్  మాదిగ, బి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.