IND vs ENG 2025: కర్మ ఎవరినీ క్షమించదు.. సంచలనం రేపుతున్న టీమిండియా పేసర్ పోస్ట్

IND vs ENG 2025: కర్మ ఎవరినీ క్షమించదు.. సంచలనం రేపుతున్న టీమిండియా పేసర్ పోస్ట్

ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను అదనంగా చేర్చిన సంగతి తెలిసిందే. శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా శుక్రవారం (జూన్ 20) లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్ట్ కోసం భారత జట్టులో హర్షిత్ రాణాను భారత సెలక్టర్లు చేర్చినట్టు బీసీసీఐ ధృవీకరించింది. దీంతో భారత స్క్వాడ్ లో ప్రస్తుతం 19 మంది ఉన్నారు. హర్షిత్ రాణా జట్టులోకి రావడంపై టీమిండియా పేసర్ ముఖేష్ కుమార్ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తనని సెలక్ట్ చేయకుండా హర్షిత్ ను సెలక్ట్ చేయడంపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. 

ఇంస్టాగ్రామ్ వేదికగా ముఖేష్ తన బాధను తెలిపాడు. "కర్మ తన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కర్మ ఎవరినీ క్షమించదు. ఏదో ఒకరోజు వెనక్కి ఇచ్చేస్తుంది. మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి". అని ముకేష్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. హర్షిత్ రాణా ఎంపిక ప్రకటించిన ఒక రోజు తర్వాత ముఖేష్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాన్ని పోస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఈ టీమిండియా పేసర్ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. గంభీర్ ను ఉద్దేశించే ముఖేష్ ఈ పోస్ట్ పెట్టి ఉంటాడని నెటిజన్స్ భావిస్తున్నారు. 

2024 ఐపీఎల్ సీజన్ లో గంభీర్ కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్ గా ఉన్న సంగతి తెలిసిందే. కేకేఆర్ జట్టులో హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలర్. ఈ కారణంగానే రాణాకు మొదట నుంచి గంభీర్ సపోర్ట్స్ ఉందని భావిస్తున్నారు. ముఖేష్ గత కొంతకాలంగా భారత టెస్ట్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. చివరిసారిగా స్వదేశంలో 2024 టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ పై  విశాఖపట్నంలో జరిగిన టెస్ట్ లో ముఖేష్ ఆడాడు. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్ తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ బెంగాల్ ఫాస్ట్ బౌలర్ కు చోటు దక్కలేదు. ఇప్పటివరకు టీమిండియాపై మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో ముఖేష్ 25.57 యావరేజ్ తో 7 వికెట్లు పడగొట్టాడు.

మరోవైపు ఇండియా ఎ జట్టులో సభ్యుడైన రాణా ఇంగ్లాండ్ సిరీస్ కోసం మొదట ప్రకటించిన 18 మంది టీమిండియా ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే రాణాను తొలి టెస్ట్ కోసం భారత స్క్వాడ్ లో చేర్చడం విశేషం. హర్షిత్ గత ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. పెర్త్‌లో జరిగిన తన తొలి టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టి రాణించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 23 ఏళ్ల రాణా లీడ్స్‌లో జరగబోయే తొలి టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాణా ఆడిన రెండు టెస్టుల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.