విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్‌‌ నిరాకరణ

విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్‌‌ నిరాకరణ

విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు నిరాకరించింది. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్‌ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ANIA) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.

ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టైన వరవరరావును మొదట మహారాష్ట్ర పుణె లోని ఎరవాడ జైలుకు తరలించారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు.  తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు చనిపోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు.