
- నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్
- ‘ద ఘోస్ట్’. సోనాల్ చౌహాన్ హీరోయిన్. ఈనెల 5న సినిమా
- విడుదలవుతోన్న సందర్భంగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూరు
- రామ్మోహన్ రావు ఇలా ముచ్చటించారు.
‘ప్రవీణ్ సత్తారు స్టైలిష్ మేకింగ్లో మునుపెన్నడూ చూడని సరికొత్త యాక్షన్ లుక్లో నాగార్జున కనిపిస్తారు. చక్కని ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న పూర్తిస్థాయి మాస్ మూవీ. నాగార్జున గారి కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. స్క్రీన్ నుంచి ఒక్క సెకెన్ కూడా చూపు తిప్పుకోలేనంత అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నాం. సంక్రాంతి తరహాలోనే దసరా కూడా సినిమాలకు పెద్ద పండుగ. అందుకే చిరంజీవి గారి ‘గాడ్ ఫాదర్’ అదే డేట్కి వస్తున్నప్పటికీ మా సినిమాను విడుదల చేస్తున్నాం. ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు అవసరమో దాని ప్రకారమే థియేటర్లు కేటాయిస్తాం కనుక ఏ సమస్య రాదు. అదీకాక నాగార్జున గారి ట్రెండ్ సెట్టర్ మూవీ ‘శివ’ రిలీజ్ (అక్టోబర్ 5) సెంటిమెంట్తో ఆ డేట్కి వస్తున్నాం. హిందీ వెర్షన్ కూడా రెడీ అవుతోంది.
కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో సేమ్ డేట్కు అక్కడ రిలీజ్ చేయలేకపోతున్నాం. ఇక మల్టీప్లెక్స్లో టికెట్ రేట్ను రూ. 200 ,- 250 (రిక్లైనర్స్), సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150 గా పెట్టాం. మిడిల్ క్లాస్ లేకపోతే సినిమా ఇండస్ట్రీనే లేదు. ఎనభై శాతం సినిమా చూసేది వాళ్లే. అందుకే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ టికెట్ రేట్లు నిర్ణయించాం. ఇక మా కొత్త చిత్రం ‘ప్రిన్స్’ దీపావళికి రానుంది. సందీప్ కిషన్, సుధీర్ బాబు సినిమాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమా త్వరలో షూటింగ్ మొదలవనుంది. అలాగే వెంకటేష్ గారితోనూ ఒక సినిమా ఉంటుంది.