నాగచైతన్య ద్విభాషా చిత్రానికి క్రియేటివ్ టీమ్ ఖరారు

నాగచైతన్య ద్విభాషా చిత్రానికి క్రియేటివ్ టీమ్ ఖరారు

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన కొత్త ప్రాజెక్ట్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఈ చిత్రానికి NC22 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇది చైతన్య తొలి తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం కావడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. దర్శకుడు వెంకట్ ప్రభుకు ఇది తొలి తెలుగు చిత్రం.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరూ కలసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌లో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఖాయమని చెప్పాలి. నాగచైనత్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో NC22 ఒకటి.

ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లలో ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం పలువురు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు టెక్నికల్ టీంని పరిచయం చేశారు.

బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్ ఎస్ఆర్ కతీర్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ రాయగా, వెంకట్ రాజన్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ కోసం అత్యంత ప్రతిభావంతుడైన రాజీవన్‌ని ఎంపిక చేశారు. అద్భుతమైన ఆర్ట్ వర్క్‌ను అందించే ఆర్ట్ డైరెక్టర్ డి.సత్యనారాయణను ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. కీలకమైన యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేయడానికి ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ యాన్నిక్ బెన్ తో పాటు మహేష్ మాథ్యూ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేస్తున్నారు.

అద్భుతమైన, ప్రతిభావంతులైన టీమ్ ని పరిచయం చేస్తూ నిర్మాతలు ఇచ్చిన తాజా అప్‌డేట్‌లు ప్రాజెక్ట్ పై అభిమానులు, ప్రేక్షకుల అంచనాలు పెంచాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ను పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.