న్యూఢిల్లీ : అదానీ గ్రూప్కు బోర్డులో రెండు సీట్లను ఆఫర్ చేయడానికి ఎన్డీటీవీ ఓకే చెప్పింది. ఓపెన్ ఆఫర్ కంటే ముందు ఈ మీడియా కంపెనీలో అదానీ గ్రూప్కు 29.18 శాతం వాటా ఉంది. ఈ వాటాను పరిగణనలోకి తీసుకొని బోర్డులో డైరెక్టర్ పొజిషన్లను ఎన్డీటీవీ ఆఫర్ చేస్తోంది. ఓపెన్ ఆఫర్ ద్వారా అదనంగా 8.26 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం అదానీ గ్రూప్కు దక్కింది. దీంతో ఎన్డీటీవీలో అదానీల వాటా 37.44 శాతానికి చేరుకుంది. ఇది కంపెనీ ఫౌండర్లు అయిన ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ల మొత్తం వాటా 32.26 శాతం కంటే ఎక్కువ.
ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేయడానికి అదానీ ఎంటర్ప్రైజెస్కు చెందిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను కంపెనీ బోర్డు ఆహ్వానించిందని ఎక్స్చేంజి ఫైలింగ్లో ఎన్డీటీవీ పేర్కొంది. ఈ నెల 9 జరిగిన బోర్డు మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదానీ గ్రూప్ నామినేట్ చేసే డైరెక్టర్ల నియామకాన్ని ఈ నెల 23 న జరగనున్న బోర్డు మీటింగ్లో చేపడతారు. ఓపెన్ ఆఫర్ తర్వాత ఎన్డీటీవీలో అతిపెద్ద షేరుహోల్డర్గా మారిన అదానీ గ్రూప్కు కంపెనీలో చైర్మన్ను మార్చే హక్కు కూడా దక్కింది. కాగా, ఎన్డీటీవీకి అప్పులు ఇచ్చిన సంస్థను అదానీ గ్రూప్ కొనుగోలు చేసి, ఇన్డైరెక్ట్గా ఈ మీడియా కంపెనీలో 29.18శాతం వాటాను దక్కించుకున్న విషయం తెలిసిందే.