అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బుధవారం ఆయన వనపర్తి జిల్లాలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన మూలంగా పంట నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు. పంటనష్టం అంచనా వేయాలని అధికారులకు చెప్పిన నిరంజన్ రెడ్డి.. రాష్ట్రంలో మంగళవారం రాత్రి వడగండ్ల వాన కురిసిన చోట రైతులకు భారీనష్టం జరిగిందన్నారు. భీమా కంపెనీల పరిధిలో నష్టపరిహారం అందే అంశాలను అంచనా వేస్తున్నామని.. వాటి పరిధిలోకి రాని రైతులను జాతీయ విపత్తు నిధి ద్వారా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరతామన్న మంత్రి.. అకాల వర్షానికి వరి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఏప్రిల్ లో అకాల వర్షాలు వస్తాయి కాబట్టి రైతులు యాసంగి పంటను మార్చి నెలలోనే కోతకు వచ్చేలా ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. ఆ దిశగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులను చైతన్యం చేస్తామన్నారు. ఇన్నేండ్లూ వర్షాధార పంటలు పండించుకునే వాళ్లమని.. తెలంగాణ వచ్చాక కాల్వల ద్వారా సంతోషంగా రైతులు పంటలు పండించుకుంచున్నారని చెప్పారు.
పంట చేతికొచ్చే ప్రస్తుత తరుణంలో వడగండ్ల వాన రైతుల ఆశలపై నీళ్లు చల్లడం బాధాకరమని.. నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకునే అన్ని అవకాశాలనూ పరిశీలించి రైతులను ఆదుకుంటామన్నారు. పంట నష్టం వివరాలు సేకరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామన్నారు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.