- నాలుగైదు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైస్ మిల్లర్ల సమస్యలకు ప్రభుత్వం సానుకూల పరిష్కారం చూపుతుందని సివిల్సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. మిల్లర్ల సమ్మె నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి మిల్లర్ల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. మిల్లర్లను ప్రత్యర్థులుగా కాకుండా ధాన్యం కొనుగోలు వ్యవస్థలో భాగస్వాములుగా చూస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు, ప్రజాధన పరిరక్షణతో పాటు మిల్లింగ్ రంగాన్ని కాపాడడమే లక్ష్యమన్నారు.
మిల్లర్లపై అనవసర భారం వేయాలనే ఆలోచన లేదని, కానీ ధాన్యం కొనుగోలు రుణాల వడ్డీ భారాన్ని విస్మరించలేమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విధించిన పెనాల్టీలు, టెండర్ ధరలు, స్టాక్ వ్యత్యాసాలపై సమగ్ర పరిశీలన జరుపుతామని చెప్పారు. అధికారుల కసరత్తు అనంతరం నాలుగైదు రోజుల్లో మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ భేటీలో పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దేవేందర్ రెడ్డి, నాగేందర్ పాల్గొన్నారు.
