
బెంగళూరు: కర్నాటక సంప్రదాయ క్రీడ కంబళ పోటీల్లో13.62 సెకన్లలో 145 మీటర్ల దూరం పరిగెత్తి ఓవర్నైట్ పాపులర్ అయిన శ్రీనివాసగౌడ సోమవారం బెంగళూరులోని స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ఇండియా (సాయ్) కు చేరుకోనున్నాడు. అయితే, అతనికి వెంటనే ట్రయల్స్ నిర్వహించడం లేదని, ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడిన తర్వాతే పరీక్ష పెడతామని సాయ్ వర్గాలు తెలిపాయి. ట్రయల్స్ తేదీని ప్రకటించాల్సి ఉంది. దాంతో, స్ప్రింట్ లెజెండ్ బోల్ట్తో పోలుస్తున్న శ్రీనివాస కాంపిటీటివ్ పోటీలకు పనికొస్తాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. అయితే, బోల్ట్తో తనను పోల్చడం సరికాదని శ్రీనివాస అంటున్నాడు. ‘అందరూ నన్ను ఉసేన్ బోల్ట్తో పోలుస్తున్నారు. కానీ అతడో ప్రపంచ చాంపియన్. నేను కేవలం బురద మళ్లలో పరిగెత్తేవాడిని’ అని చెప్పాడు. కాగా.. శ్రీనివాస రాత్రికి రాత్రే ఒలింపిక్స్టార్ కాబోడని కంబళ అకాడమీ కన్వీనర్, చైర్మన్ గుడప కదంబ పేర్కొన్నారు. అతడి సామర్థ్యాన్ని సైంటిఫిక్గా జడ్జ్ చేయాలన్నారు.