ఒడిశా రైలు ప్రమాదం.. విద్యుత్‌ షాక్‌తోనే 40 మంది మృతి

ఒడిశా రైలు ప్రమాదం.. విద్యుత్‌ షాక్‌తోనే 40 మంది మృతి

ఒడిశా బాలాసోర్ లో జరిగిన ఘోర  రైలు ప్రమాదంలో  దిగ్ర్భాంతికి గురిచేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 288 మంది చనిపోగా..1000 మందికి పైగా గాయప‌డ్డారు. మ‌ర‌ణించిన వారిలో  ఇప్పటి వరకు కూడా 101 మంది ప్రయాణీకుల వివ‌రాలు  తెలీయ‌రాలేదు.  వారి మృత‌దేహాల‌ను క‌ట‌క్ లోని  ప్రభుత్వ మార్చురీలో భద్రపరిచారు. అయితే మృతుల్లో కనీసం 40 మంది విద్యుత్ షాక్ వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

ఎలాంటి గాయాలు లేవు...

రైలు  ప్రమాదం తర్వాత ఘటనాస్థలిలో రెస్క్యూ సిబ్బంది  సహాయక చర్యలు చేపట్టింది.  పట్టాలు తప్పిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఇందులో కనీసం 40 మృతదేహాల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవు. ఈ  విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు  ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. అయితే మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగి బోగీలపై పడి విద్యుత్‌ షాక్‌ జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.