టెస్కాబ్​లో సాఫ్ట్ వేర్ స్కామ్​!..రూ.25 కోట్లకు ఎసరు

టెస్కాబ్​లో సాఫ్ట్ వేర్ స్కామ్​!..రూ.25 కోట్లకు ఎసరు
  • నామినేషన్ బేసిస్​లో రూ.25 కోట్లకు ఎసరు
  • స్టేట్​వైడ్​ 9 డీసీసీబీలు, 369 బ్రాంచిల్లో సాఫ్ట్​వేర్​ అప్డేట్ కాంట్రాక్టు
  • రూ.3 కోట్లకు చేస్తామని వచ్చిన కంపెనీని రిజక్ట్ చేసిన ఆఫీసర్లు
  • ఒక్కో ప్యాక్స్ పైన రూ.4.60 లక్షల ఆర్థిక భారం
  • డీసీసీబీ పాలకమండళ్ల తీర్మానం లేకుండానే టెస్కాబ్  ఫైనల్ 
  • ఆఫీసర్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు

నల్గొండ, వెలుగు : టెస్కాబ్ (తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్)లో సాఫ్ట్​వేర్ కాంట్రాక్టు వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని తొమ్మిది డీసీసీబీలు, 369 పీఏసీఎస్​లలో  సాఫ్ట్ వేర్ అప్​డేట్​చేసేందుకు ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ బేసిస్​పై టెండరు కట్టబెట్టడమేగాక, రైతుల సొమ్ముతో నడుస్తున్న పీఏసీఎస్​లపైన అనవసర ఆర్థిక భారం మోపేలా ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. దీని పై న్యాయ పోరాటం చేసేందుకు డీసీసీబీ డైరక్టర్లు సిద్ధమయ్యారు.

జరిగిందీ ఇదీ..

రాష్ట్రంలో 9 డీసీసీబీలు, 369 పీఏసీఎస్​లలో ఇప్పుడున్న సాఫ్ట్​వేర్​ స్థానం లో కొత్త సాఫ్ట్​వేర్  అప్​డేట్​ చేయాలని టెస్కాబ్ ఆఫీసర్లు తీర్మానించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక సబ్ కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ లో టెస్కాబ్ చైర్మన్, వైస్​చైర్మన్​తో పాటు  పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ నిర్ణయం మేరకు సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ చేసేందుకు పక్కా ప్లాన్ చేశారు. ప్రస్తుతం సొసైటీ బ్యాంకుల్లో సింగిల్ బేస్ డేటా సిస్టమ్ (పీఏఎన్ఏసీఈఏ) పనిచేస్తోంది. దీని పైన డీసీసీబీలో, పీఏసీఎస్​లలో ఆన్​లైన్​ బ్యాంకు లావేదేవీలు జరుగుతున్నాయి. 2013 నుంచి ఈ సాప్ట్ వేర్ పనిచేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 22 డీసీసీబీలో ఈ సాఫ్ట్​వేర్ ఇన్​స్టాల్​ చేసేందుకు పెట్టిన ఖర్చు కేవలం రూ.4 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఆసాఫ్ట్​వేర్ అవుట్​డేటెడ్​ అయిందని చెప్పి దాని స్థానంలో కొత్త సాఫ్ట్​వేర్​ అప్​డేట్​చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. బాంబేకు చెందిన ఓ కంపెనీకి సాఫ్ట్​వేర్​ రూపొందించే కాంట్రాక్టు అప్పగించారు. అయితే ఈ కంపెనీ కంటే ముందు రాష్ట్రానికి చెందిన మరొక కంపెనీ కూడా సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ చేసేందుకు ముందుకు వచ్చింది. కాంట్రాక్టు కోసం ఈ రెండు కంపెనీలు పోటీ పడ్డాయి. రూ. 3 కోట్లకే సాఫ్ట్​వేర్ అప్డేట్ చేస్తామని వచ్చిన సంస్థను కాదని బాంబేకి  చెందిన వేరొక సంస్థకు రూ.25 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. విచిత్రమేమం టే 2010 వర్షన్ సాఫ్ట్​వేర్ ఇన్​స్టాల్​చేస్తామని చెప్పిన సంస్థకు కాకుండా 2002 వర్షన్ సాఫ్ట్​వేర్ ఇన్​స్టాల్​చేసే సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం అను మానాలకు తావిస్తోంది. పైగా ఎలాంటి టెండర్​ లేకుండా నామినేషన్ బేసిస్​పై కాంట్రాక్టు ఇవ్వడం అనే విషయం అంతుచిక్కడం లేదు. ఇప్పటికీ బాగానే పనిచేస్తున్న సాఫ్ట్​వేర్​ను అసలు మార్చాలని అవసరమే లేదని, అనవసరంగా బ్యాం కుల పై ఆర్థిక భారం మోపేలా ఆఫీసర్లు వ్యవహరిస్తు న్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

రూల్స్​కు పాతర…

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రూ. 10 వేల అమౌంట్ దాటిన ఏ వర్క్ అయినా స్టేట్​ లెవల్​ టెక్నికల్ కమిటీ అప్రూవల్ ఉండాలి. కానీ అలాంటి నిబంధనలేవీ పాటించలేదని తెలుస్తోంది. డీసీసీబీలు, వాటి పరిధిలో పనిచే సే పీఏసీఎస్ లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా డీసీసీబీ  పాలకమండళ్ల తీర్మానం తప్పనిసరి. కానీ సాఫ్ట్​వేర్ కాంట్రాక్టు వ్యవహారం లో టెస్కాబ్ ఆఫీ సర్లే ఫైనల్ చేశారు. టెస్కాబ్ నిర్ణయాన్ని డీసీసీబీలకు పంపి ఆమోదం తీసుకున్నారని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. అదీగాక ఈ సాఫ్ట్​వేర్ పనితీరు సరిగాలేదని కర్ణాటక వెళ్లొచ్చిన డీసీసీబీ ఆఫీసర్లు సైతం తేల్చారని యూనియన్ లీడర్లు చెబుతున్నారు.  ఒకవేళ సాఫ్టవేర్ మార్చా లంటే ఆర్బీఐ, నాబార్డు రూల్స్ కచ్చితంగా పాటించాలని చెప్తున్నారు. ఆ ఫీసర్లు తీసుకుంటున్న చర్యల వల్ల బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి వస్తద ని అంటున్నారు.

హైకోర్టులో పిల్ వేస్తాం

డీసీసీబీలు, పీఏసీఎస్​లలో సాఫ్ట్​వేర్ మార్చాలని టెస్కాబ్ తీసుకున్న ఏక పక్ష నిర్ణయాన్ని ఖండి స్తున్నాం. టెండరు లేకుండా నామినేషన్ బేసిస్​పై రూ.25 కోట్లకు కాంట్రా క్టు ఇవ్వడం రూల్స్​కు విరుద్ధం. దీనికి సంబంధించిన పే ఆర్డర్ కాపీ ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద అడిగినా ఆఫీసర్లు నిరాకరించారు. దీంతో హైకోర్టులో పిల్ వేస్తున్నాం. ఆఫీసర్ల చర్యలను ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీని పైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.

–కుంభం శ్రీనివాస్​రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్, నల్గొండ