బాయ్‌‌ఫ్రెండ్‌‌‌‌‌ను కలసిన మైనర్ బాలిక.. గ్యాంగ్ రేప్ అంటూ పోలీసులకు కట్టుకథ

బాయ్‌‌ఫ్రెండ్‌‌‌‌‌ను కలసిన మైనర్ బాలిక.. గ్యాంగ్ రేప్ అంటూ పోలీసులకు కట్టుకథ

రాయ్‌‌పూర్: పేరెంట్స్ తిడతారనే భయంతో తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఓ మైనర్ బాలిక కట్టుకథ చెప్పిన ఘటన ఛత్తీస్‌‌గఢ్‌‌లోని కువార్ధా జిల్లాలో జరిగింది. వివరాలు.. ఓ బాలిక (14) తన ఫ్రెండ్‌‌ను కలవడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. చీకటి అవుతున్నా సదరు బాలిక ఇంటికి రాకపోయేసరికి ఆమె కుటుంబీకులు భయపడ్డారు. బాలిక కనిపించడం లేదని సమీపంలోని పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఆమె కోసం వెతికారు. అయితే అదే రోజు రాత్రి 11.30 గంటలకు బాలిక ఇంటికి చేరుకుంది. ఇంత రాత్రి దాకా ఎందుకు రాలేదని కుటంబీకులు బాలికను అడగ్గా.. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తనపై గ్యాంగ్ రేప్‌‌కు పాల్పడ్డారని బాలిక వాపోయింది.

బాలిక ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానితులను పట్టుకోవడానికి ఏడు టీమ్స్‌‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రేప్ జరిగిన ప్రాంతం వద్దకు సీన్ క్రియేట్ చేయడానికి బాలికతోపాటు ఆమె కలవడానికి వెళ్లిన ఫ్రెండ్‌‌ను కూడా తీసుకెళ్లారు. అయితే సదరు బాలిక, ఆమె ఫ్రెండ్ చెప్పిన వివరాలకు ఘటన జరిగిన ప్రాంతంలో ఆనవాళ్లకు పొంతన కుదరకపోవడంతో వారిద్దరినీ పోలీసులు ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. తామిద్దరమూ రిలేషన్‌‌షిప్‌‌లో ఉన్నామని, కలవడానికి పీజీ కాలేజీకి వెళ్లామని వాళ్లు ఒప్పుకున్నారు. బాలుడు అబద్ధం చెప్పమనడంతోనే అలా చెప్పానని బాలిక పేర్కొంది. దీంతో సదరు బాలుడ్ని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.