
- వచ్చే నెల 31తో ముగియనున్న సర్పంచ్ల టర్మ్
- ఎన్నికల నిర్వహణకు ఈసీ రెడీ.. సర్కారు నుంచి నో రెస్పాన్స్
- మరోవైపు సర్పంచ్లకు భారీగా బిల్లులు బకాయి
- ఆరు గ్యారంటీలపై ఫోకస్చేసిన సర్కారు
- లోక్సభ ఎన్నికలలోపే వాటిని అమలు చేసే యోచన
- ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లకు వెళ్తే లాభమనే లెక్కలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. లోక్ సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ టైమ్లో పంచాయతీ ఎన్నికలకు పోతే నెల రోజులపాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో ఆరు గ్యారంటీల అమలుతోపాటు ప్రజా పాలన కార్యక్రమాలు ముందుకు సాగవు. లోక్ సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో అధికార పార్టీ ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నది. ఈ సారి రాష్ట్రంలో ఎక్కువ లోక్సభ సీట్లు సాధిం చాలన్న పట్టుదలతో ఉన్న పార్టీ పెద్దలు.. ఈ లోపే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని భావిస్తున్నారు.
వచ్చే నెల సర్పంచ్ల టర్మ్ కంప్లీట్
సర్పంచ్ల టర్మ్ జనవరి 31తో ముగుస్తున్నది. అప్పటి కల్లా ఎన్నికల పక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ ప్రాసెస్ను స్టార్ట్ చేసింది. ఎన్నికల నిర్వహణకు అధికారుల వివరాలు పంపాలని కలెక్టర్లకు, ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని పంచాయతీ రాజ్, ఈసీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలుండగా వీటికి మూడు లేదా నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వ హించాల్సి ఉంది. ఇందుకు నెల రోజులు టైమ్ పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఐదేండ్ల టర్మ్లో రెండేండ్లు కరోనా కారణంగా ఏ పనులూ చేయలేకపోయామని, బాధ్యతలు చేపట్టాక 8 నెలలు జాయింట్ చెక్ పవర్ వివాదంతో పనులు ముందుకు వెళ్లలేదని సర్పంచ్లు గుర్తుచేస్తున్నారు.
అందుకే టర్మ్ను పొడిగించాలని కోరుతున్నారు. తమను పర్సన్ ఇన్చార్జ్లుగా కొనసాగిస్తే ఎన్నికలు ఆలస్యమైనా ఇబ్బంది ఉండదని అంటున్నారు.
భారీగా బిల్లులు పెండింగ్
గ్రామాల్లో సర్పంచ్లు చేసిన వివిధ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఒక్కో సర్పంచ్కు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, రైతు వేదికల బిల్లులు ఉన్నాయి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇవ్వకపోవడం, కేంద్రం నుంచి ఉపాధి హామీ నిధులు టైమ్కు అందకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.1,200 కోట్ల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్మికులకు రెండు మూడు నెలలకోసారి జీతాలు ఇస్తున్న పరిస్థితి నెలకొంది.
బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం పెండింగ్
లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లను 23 నుంచి42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ ప్రాసెస్ చేస్తే బీసీలకు రిజర్వేషన్లు పెరిగి మిగతా రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. ఇందుకు కొంత టైమ్ పట్టొచ్చు. ఈ అంశంపై రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలతో అఖిలపక్షం నిర్వహించి వారి సలహాలు, సూచనలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.