తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య తగ్గించి చూపేందుకే తక్కువ టెస్టులు చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం ఎక్కువ టెస్టులు చెయ్యాలని అంటుంటే సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణలో తక్కువ టెస్టులు చేయిస్తున్నారని ఆయన అన్నారు. కరోన కేసుల సంఖ్య తక్కువ చూపడానికి తాపత్రయ పడుతున్నారని, అందుకే ఎవరైనా చనిపోయినా కూడా వారికి కరోన టెస్టులు చెయ్యవద్దని ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చిందని అన్నారు.
కరోన కేసులు తక్కువ గా చూపే ప్రయత్నం సరైన చర్య కాదని, కరోనాతో చనిపోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం పది లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు ఉత్తమ్.
ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ రూ.30 వేల కోట్లు కేటాయించామని, ధాన్యాన్ని ఎం.ఎస్.పి కి కొనుగోలు చేస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, ఏ ఒక్క పని చెయ్యలేదని ఉత్తమ్ ఆరోపించారు. ధాన్యంకొనుగోలు కేంద్రాల్లో బస్తాలు , పట్టాలు లేవని, అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుందన్నారు . రైతులు ధాన్యంతో కొనుగోలు కేంద్రం కు వచ్చి మూడు వారాలైనా తేమ ఉందని ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, తేమ శాతం ఎక్కువ గా ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. బస్తాలు, పట్టాలు యుద్ధ ప్రాతిపదికన సప్లై చెయ్యాలన్నారు.

