బషీర్బాగ్, వెలుగు: నగరంలోడ్రగ్స్ కట్టడికి పోలీస్ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ)ను ప్రస్తుతం ఉన్న రెండు బృందాల నుంచి ఐదు ప్రత్యేక విభాగాలకు విస్తరించినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. గురువారం రాజేంద్రనగర్లో ఏర్పాటు చేసిన హెచ్– న్యూ కొత్త కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ విభాగం డ్రగ్స్ నెట్వర్క్లపై దాడులు, వినియోగదారులపై నిరంతరం నిఘా ఉంచుతుందని స్పష్టం చేశారు.
ముఖ్యంగా ‘టీమ్-14’ పేరుతో ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, నాగార్జున్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు పని చేస్తాయని వివరించారు. లోతైన విచారణల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడటమే ఈ విభాగాం ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కీలక కేసులను ఛేదించిన హెచ్– న్యూ.. తాజా విస్తరణతో డ్రగ్స్ మాఫియాకు గట్టి హెచ్చరిక జారీ చేస్తోందని ఆయన వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ జాడ లేకుండా చేసేందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

