
నల్గొండ: కరోనా సెకండ్ వేవ్ ప్రచారం జనం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. చలికాలంలో సంక్రమించే సీజనల్ వ్యాధులు, కరోనా లక్షణాలను పోలి ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఫ్రెండ్స్ , రిలేటివ్స్ లో ఎవరికైనా జలుబు లక్షణాలు కనిపిస్తే చాలు భయపడిపోతున్నారు. వీరితో మాట్లాడేందుకే సంకోచిస్తున్నారు. కరోనా సింప్టమ్స్ లో దగ్గు , జలుబు కూడా ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. చలికాలానికి తోడు వరుస పండుగలు, ఫంక్షన్లు ఉండడంతో సెకండ్ వేవ్ పట్ అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. ఈ క్రమంలో సీజనల్ వ్యాధులు సోకినంత మాత్రాన కరోనా వచ్చినట్లు భావించొద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు చెప్తున్నారు.
వీస్తున్న చలిగాలులు..పడిపోయిన ఉష్ణో గ్రతలు
ఈ నెల మొదటివారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయని వాతావరణ శాఖ ఆఫీసర్లు చెప్పారు. డిసెంబర్లో రావాల్సిన ఉత్తరగాలులు కూడా ఇప్పుడే వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం పది గంటల వరకు వాతావరణం చలిగానే ఉంటుంది. తిరిగి సాయంత్రం నాలుగైదు గంటల నుంచే చలిగాలులు వీస్తుండడంతో పాటు, చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిలో జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. వీటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోయినప్పటికీ, శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని చెప్తున్నారు. పరిస్థితి అదుపుతప్పి ప్రాణాల మీదకు వచ్చేంత వరకు చూడొద్దని సూచిస్తున్నారు.
అసింప్టమాటిక్ కేసులే ఎక్కువ…
జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అసింప్టమాటిక్ పేషెంట్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం పాజిటివ్ కేసు లు 18,799 కాగా, సింప్టమాటిక్ 7,358, అసింప్టమాటిక్ కేసులు 11,441 వరకు ఉన్నాయి. కరోనా వైరస్ చిన్నపిల్లల మీద అంతగా ప్రభావం చూపడంలేదని ఆఫీసర్లు చెప్పారు. పాజిటివ్ కేసుల్లో 20 నుంచి 49 ఏళ్ల మధ్య వారే 11,843 మంది ఉన్నారు. తొమ్మిది ఏళ్ల లోపు వారు 761 మంది ఉండగా, ఇందులో 272 మంది మాత్రమే నాలుగేళ్లలోపువారు. కరోనా సోకితే జలుబు, దగ్గు , తీవ్ర జ్వరం, ఒళ్లునొప్పులు, వాసన, రుచి కోల్పవడం వంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. అయితే దగ్గు , జలుబు ఉన్నంత మాత్రాన కరోనా సోకినట్లుగా భయపడొద్దని డాక్టర్లు చెప్తున్నారు. ఆరోగ్యంలో ఏదైనా మార్పులు కనిపిస్తే అప్పుడు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.