
న్యూఢిల్లీ: కాలం చెల్లిన (ఓవర్ ఏజ్డ్) వాహనాలకు ఢిల్లీలో ఇకపై ఫ్యుయెల్ పోయరు. జూలై1 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
15 ఏండ్లు దాటిన పెట్రోల్ వెహికల్స్, 10 ఏండ్లు దాటిన డీజిల్ వెహికల్స్ కు ప్రభుత్వం ‘ఫ్యుయెల్ బ్యాన్’ ను అమలులోకి తెచ్చింది. ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాలు విపరీతమైన వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
మొత్తం కర్బన ఉద్గారాల్లో 51 శాతం ఇలాంటి వాహనాల నుంచే వస్తోందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) నిరుడు నవంబరులో ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) స్టాట్యుటరీ డైరెక్షన్ ను జారీ చేసింది.
జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న గూడ్స్ క్యారియర్, కమర్షియల్, వింటేజ్, టూ వీలర్స్ వెహికల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఏక్యూఎం సూచించింది.
దీంతో ప్రభుత్వం అలాంటి వాహనాలకు ‘ఫ్యుయెల్ బ్యాన్’ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్క ఢిల్లీలోనే 62 లక్షల వాహనాలపై ఫ్యుయెల్ బ్యాన్ ప్రభావం పడే అవకాశం ఉంది.
నిషేధం అమలు ఇలా..
ఢిల్లీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, మునిసిపల్ సిబ్బందిని పెట్రోల్ బంకులకు తరలిస్తారు. ఓవర్ ఏజ్డ్ వెహికల్స్ బంకులకువస్తే వారు ఇంధనం పోయకుండా చూస్తారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ కెమెరాల సాయంతో కాలం చెల్లిన వాహనాలను ఇప్పటికే గుర్తించారు.
మొత్తం 498 బంకుల్లో అలాంటి కెమెరాలు అమర్చారు. వాహన్ డేటాబేస్ కూడా అనుసంధానమై ఉన్న ఈ కెమెరాలు.. కాలం చెల్లిన వెహికల్స్ ప్యుయెల్ స్టేషన్కు వస్తే, వెంటనే ఆ స్టేషన్ ఆపరేషన్ను అలర్ట్ చేస్తుంది.