ఎండ తీవ్రతకు రోజూ వేల కోళ్లు చనిపోతున్నాయి

ఎండ తీవ్రతకు రోజూ వేల కోళ్లు చనిపోతున్నాయి

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండ వేడితో రోజూ వేల కోళ్లు చనిపోతున్నాయి. దీంతో పాటు.. ఫామ్స్ లో గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గుతోంది. అదనపు భారాన్ని భరించి వేలాది రూపాయలు ఖర్చు చేసినా… సమయానికి పెరుగుదల లేక కోళ్ల పెంపకందారులు నష్టాల పాలవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా  కోళ్లు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫామ్ నిర్వాహకులు.

పౌల్ట్రీ ఫామ్ లో పెంచే కోళ్లు 32 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలుంటే తట్టుకోలేవు. అయితే సంగారెడ్డి జిల్లాలో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్స్ ఉంటున్నాయి. దాంతో వేసవికి తగ్గట్టుగా కోళ్లకు చల్లని ప్రదేశాలను ఏర్పాట్లు చేస్తున్నారు. గుడ్ల ఉత్పత్తి చేసే కోళ్లను పెంచేందుకు ఆధునికమైన కేజీస్ ఫారాలు వినియోగిస్తున్నారు. స్పింక్లర్లు, ఫాగర్స్ తో ఉష్ణోగ్రత ప్రభావం కోళ్లపై పడకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గుడ్డు ఉత్పత్తికి పెంచే కోళ్లు చాలా చనిపోతున్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్థి మండలం లో వడదెబ్బకు ఈ నెల 17,18 కలిపి రెండు రోజులకు వెయ్యి కోళ్లు చనిపోయాయి. మూడు, నాలుగు వందల కోళ్ల ఆరోగ్యం దెబ్బతింది.

పెంపకందారులకు సమ్మర్ లో ఖర్చుల భారం కూడా పెరుగుతోంది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి కోడిపిల్లలను హైదరాబాదు, చెన్నై నుంచి కొనుగోలు చేస్తారు ఫామ్ నిర్వాహకులు. అంత డబ్బులు పోసి కొన్నా.. చివరకు ఏమీ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల సంరక్షణ కోసం అదనపు కూలీలను పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నిర్వాహకులకి. వీటితో పాటు స్ప్రింక్లర్లు, ఫాగర్స్ తో విద్యుత్ ఛార్జీల భారం కూడా పడుతోంది.

బాయిలర్ , లేయర్ , పశువుల పెంపకం దారులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మూగ జీవాలను కాపాడుకోవచ్చంటున్నారు వెటర్నరీ వైద్యులు.  నిర్వాహకులు మాత్రం ఎండాకాలం తమకు నష్టాలు తప్పడం లేదని చెబుతున్నారు. ఎండ తీవ్రతకు ఇటు బాయిలర్ కోళ్లే కాకుండా.. మామూలు మూగ జీవాలుకూడా నచిపోతున్నాయి.