
- పీఐబీ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: ప్రెస్ సేవా పోర్టల్ను సింగిల్ విండో సొల్యూషన్గా ప్రవేశపెట్టామని, ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుతుందని ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (పీఆర్జీఐ) యోగేశ్ బవేజా అన్నారు. సోమవారం హైదరాబాద్ కవాడిగూడలోని సీజీవో టవర్స్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో వార్తలాప్ పేరుతో నిర్వహించిన వర్క్ షాప్లో ఆయన మాట్లాడారు. ఈ పోర్టల్ ద్వారా పారదర్శకత పెరుగుతుందని, పబ్లిషర్లకు మరింత సౌలభ్యం లభిస్తుందని వివరించారు.
అనంతరం పీఐబీ హైదరాబాద్ అడిషనల్ డీజీ శృతి పాటిల్ మాట్లాడుతూ.. తెలంగాణలో తొలిసారి ఇలాంటి ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించామని, ఇది పబ్లిషర్ల సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తుందని తెలిపారు. పీఆర్జీఐ సహకారంతో త్వరలో ప్రచురణకర్తల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. డిప్యూటీ ప్రెస్ రిజిస్ట్రార్ అశుతోష్ మొహ్లే కొత్త చట్టంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. 2024 మార్చి నుంచి రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతోందని, 60 రోజుల్లోగా స్పందన రాకపోతే దరఖాస్తులు డీమ్డ్ అప్రూవ్గా పరిగణిస్తామని ఆయన తెలిపారు.
ప్రచురణకర్తలు ఏజెంట్ల సహాయం తీసుకోకుండా నేరుగా పీఆర్జీఐ పోర్టల్ వాడాలని సూచించారు. ఎన్ఐసీ అసిస్టెంట్ డైరెక్టర్ గౌరవ్ శర్మ మాట్లాడుతూ.. ప్రెస్ సేవా పోర్టల్ గురించి లైవ్ డెమో ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పీఐబీ అధికారులు మానస్ కృష్ణకాంత్, డిప్యూటీ డైరెక్టర్లు గాయత్రి, శిశచరణ్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణ సమాచార శాఖ అధికారలు, పలువురు పబ్లిషర్స్ పాల్గొన్నారు.