V6 News

డికాక్ విధ్వంసకర సెంచరీ.. పంజాబ్ ముందు భారీ స్కోర్

డికాక్ విధ్వంసకర సెంచరీ.. పంజాబ్ ముందు భారీ స్కోర్

ఐపీఎల్ 2026లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) బ్యాటర్లు పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కాగా మ్యాచ్ ప్రారంభంలోనే పంజాబ్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా అర్ష్‌దీప్ చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుస బంతుల్లో ర్యాన్ రికెల్టన్(1), సూర్యకుమార్ యాదవ్ (0) ను అవుట్ చేసి ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. 

ముంబై 12 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్వింటన్ డికాక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే డికాక్ తన సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా 60 బంతుల్లో 112 పరుగులు (8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి నాటౌట్ గా నిలిచి ముంబైకి భారీ స్కోరు అందించాడు. మరోవైపు యంగ్ బ్యాటర్ నమన్ ధీర్ (50) హాఫ్ సెంచరీతో డికాక్‌కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇన్నింగ్స్ మధ్యలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా (14) భారీ షాట్ ఆడగా, బౌండరీ లైన్ వద్ద పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ముంబై బ్యాటర్లు 195 పరుగుల భారీ స్కోరు చేయడంతో, పంజాబ్ గెలవాలంటే 196 పరుగులు చేయాలి.. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది కాబట్టి, శ్రేయస్ అయ్యర్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ముంబై బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరీ.