
నిరుపేద కుటుంబం.. కొడుకు పనిచేస్తేనే ఇంట్లో గడుస్తుంది. అలాంటి కొడుకు కనిపించకుండా పోయాడు.. కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20 రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా కొడుకు ఆచూకీ తెలిసిరాలేదు.. చివరికి శవమై ఆస్పత్రి మార్చురీలో కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసుల తీరుపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 6న అర్థరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రైవేట్ ఉద్యోగి శ్రవణ్ కుమార్( 23) అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం చాదర్ ఘాట్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డ శ్రవణ్ కుమార్ రెండు రోజులు చికిత్స అనంతరం మృతిచెందాడు. డిసెంబర్ 11న శ్రవణ్ తల్లిదండ్రులు కనిపించకుండా పోయాడని చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో కూడా ప్రమాదం గురించి గానీ, శ్రవణ్ కుమార్ ను ఆస్పత్రిలో చేర్పించిన విషయం గానీ చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
చివరికి శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రిలోని మార్చురీలో తన కుమారుడిని శవాన్ని గుర్తించి బోరున విలపించారు. పోలీసులకు సమాచారం ఇస్తే.. అప్పుడు రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని చెప్పారు.. అయితే పోలీసుల తీరుపై మృతుని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 20 రోజులు అయినా సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ ముందుకు ధర్నాకు దిగారు మృతుడి బంధువులు .