బిజినెస్ డెస్క్, వెలుగు: మనీలాండరింగ్ కేసుల వల్ల ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్న రియల్టీ కంపెనీ యూనిటెక్ ప్రమోటర్ల గురించి సెన్సేషనల్ న్యూస్ బయటికి వచ్చింది. వీళ్లు ఏకంగా జైలులోనే అండర్గ్రౌండ్ ఆఫీసు పెట్టుకున్నారు. అక్కడి నుంచే ఆఫీసు పనులు చేసుకుంటూ, తమ సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సంగతిని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. కంపెనీ ఫౌండర్ రమేశ్ చంద్ర జైలులోనే ఆఫీసు పెట్టగా, ఆయన కొడుకులు సంజయ్, అజయ్ చంద్రలు బెయిల్పై ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్లని తెలిపింది. జైలులో సోదాలు చేయగా ఈ సంగతి తెలిసిందని పేర్కొంది. జైలు ఆఫీసర్లతో మిలాఖత్ అయి నిందితులు అండర్గ్రౌండ్ ఆఫీసు ఏర్పాటు చేయడమేగాక, ఇక్కడి నుంచే తమకు కావాల్సిన వారితో సంప్రదింపులు జరిపారు. ఈడీ ఒక డమ్మీ డైరెక్టర్ను ప్రశ్నిస్తున్నప్పుడు అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ మాధవీ దివాన్ జడ్జిలకు వెల్లడించారు. జైలు నుంచి వీళ్లు ఇచ్చే ఆదేశాలను తీసుకోవడానికి బయట కొందరు యూనిటెక్ ఆఫీసర్లను ఉంచారని చెప్పారు.
విచారణకు ఆదేశం
ఈడీ వాదనలను విన్న సుప్రీంకోర్టు జడ్జిలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. జైలు ఆఫీసర్లపై వచ్చిన ఆరోపణలపై స్వయంగా విచారణ జరపాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ను ఆదేశించారు. సంజయ్ను తీహార్ జైలు నుంచి ముంబై ఆర్థర్ రోడ్ జైలుకు, అజయ్ను తలోజా జైలుకు మార్చాలని జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలోని బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అండర్గ్రౌండ్ ఆఫీసు నుంచి వందలాది సేల్ డీల్స్, డిజిటల్ సిగ్నీచర్లను, కంప్యూటర్లను, ముఖ్యమైన సమాచారాన్ని తీసుకున్నామని మాధవి వివరించారు. దేశవిదేశాల్లోని కంపెనీకి చెందిన రూ.600 కోట్ల విలువైన యూనిటెక్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. షెల్ కంపెనీలతో నిందితులు దందాలు నడిపారని, ఆస్తులను అమ్మేస్తున్నారని ఆరోపించారు. నిందితుల తరఫున లాయర్ వికాస్ సింగ్ మాట్లాడుతూ జైలు రూల్స్కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదని వాదించారు. తన బంధువు అంత్యక్రియలకు వెళ్లేందుకు సంజయ్ చంద్రకు సుప్రీంకోర్టు ఇటీవల 15 రోజుల ఇంటెరిమ్ బెయిల్ ఇచ్చింది. తన తల్లిదండ్రులకు కరోనా వచ్చినందున, బెయిల్ ఇవ్వాలంటూ గత ఆగస్టులో దాఖలు చేసిన పిటిషన్ను మాత్రం తోసిపుచ్చింది. 2017 నుంచి జైలులో ఉంటున్న అజయ్ చంద్రకు కూడా బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇండ్ల కొనుగోలుదారుల డబ్బును కాజేశారని ఆరోపణలు రావడంతో.. రూ.750 కోట్లను తమ వద్ద డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు చంద్ర కుటుంబాన్ని 2017లోనే ఆదేశించింది. బకాయిలు, సెటిల్మెంట్ల కోసం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలతో చర్చించేందుకు సుప్రీంకోర్టు యూనిటెక్ గ్రూపునకు కొత్త మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్కు ఈ నెల 25న ఓకే చెప్పింది.