- పాక్కు చెందిన దావత్ ఎ ఇస్లామ్ గ్రూప్తో సంబంధాలు
- కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్రం
- ఇద్దరి అరెస్ట్, అదుపులో మరో ఐదుగురు అనుమానితులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న రాజస్థాన్లోని ఉదయ్పూర్ టైలర్ హత్య కేసును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కి అప్పగించింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఐఎస్ తరహాలో మర్డర్ జరిగిన ఈ కేసులో టెర్రరిస్టుల కుట్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని ఉత్తర్వులిచ్చింది. మహమ్మద్ రియాజ్ అన్సారీ, మహమ్మద్ ఘోష్ కలిసి టైలర్ కన్హయ్య లాల్ను కిరాతకంగా హత్య చేశారు. ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేయగా.. కేసు దర్యాప్తు కోసం రాజస్థాన్ సర్కారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో స్లీపర్ సెల్స్ అనే అనుమానంతో పోలీసులు మంగళవారం రాత్రి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ అధికారులు బుధవారం మరో ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
హంతకులకు పాక్తో సంబంధాలు
ఉదయపూర్ టైలర్ని చంపినవాళ్లలో ఒకరైన మహ్మద్ రియాజ్అన్సారీకి పాక్ టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. అతడి ఫోన్లో పాకిస్తాన్కు చెందిన 10 నంబర్లు ఉన్నాయని తెలిపారు. దావత్ ఎ ఇస్లామ్ అనే గ్రూప్తో అన్సారీ టచ్లో ఉన్నాడని తెలిసిందన్నారు. మరో నిందితుడు రెండు సార్లు నేపాల్ వెళ్లి కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్లతో కలిశాడని చెప్పారు. అతనికి దుబాయ్లోనూ సంబంధాలున్నట్లు గుర్తించామని చెప్పారు. కన్హయ్యను చంపడానికి ముందు ఇద్దరూ కలిసి అనేక ఐఎస్ వీడియోలు చూసినట్లు, పాకిస్తాన్లోని ఫోన్ నంబర్లకు కాల్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు.
సెక్యూరిటీ కోసం కన్హయ్య విజ్ఞప్తి
కన్హయ్య లాల్కు వారం రోజుల కిందే చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని తెలిసింది. నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కన్హయ్యను జూన్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. 15న ఆయన బెయిల్మీద బయటకు వచ్చాడు. ఆ రోజు నుంచి నజీమ్ అనే వ్యక్తి మరికొందరు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ధన్మండి పోలీసులకు కన్హయ్య ఫిర్యాదు చేశాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరువర్గాలను ఎస్హెచ్వో పిలిపించి నచ్చజెప్పి పంపించేశారే తప్ప టైలర్కు రక్షణ కల్పించలేదని మండిపడ్డారు. అదే సమయంలో కన్హయ్య లాల్కు సెక్యూరిటీ కల్పించి ఉంటే ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అంత్యక్రియలకు వేలాది జనం
పోస్ట్ మార్టం తర్వాత టైలర్ కన్హయ్య లాల్ మృతదేహాన్ని పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. కట్టుదిట్టమైన పోలీసుల భద్రత నడుమ బుధవారం అశోక్నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన అంతిమయాత్రకు వేలాది మంది తరలివచ్చారు. నిందితులను ఉరితీయాలంటూ బంధువులు నినాదాలు చేశారు.