
- సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ వ్యవస్థాపకుడు పురుషోత్తం
బషీర్బాగ్, వెలుగు : సామాన్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్త రాజకీయ సంస్కృతిని నెలకొల్పేందుకు సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్పీఐ) తెలంగాణ కమిటీ కృషి చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోద్రామోని పురుషోత్తం తెలిపారు. నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధిని ప్రజలకు అందించడమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంగళవారం పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ. రాజేశ్ సభాధ్యక్షుడిగా వ్యవహరించగా.. 33 జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధులు పురుషోత్తంను రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గొప్ప సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ 1934లో ఎస్పీఐని స్థాపించారని, ఇప్పటికి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపుతో జాతీయ రాజకీయ పార్టీగా కొనసాగుతుందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని సోషలిస్ట్ భావాలు కలిగిన సమూహాలతో కలిసి కొత్తగా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. త్వరలో రైతు, మహిళా, విద్యార్ధి, యువజన విభాగాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 10 అసెంబ్లీ సీట్లలో పార్టీకి అభ్యర్థులు ఉన్నారని, పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ సభలో పార్టీ నేతలు బి. సుజాత, ఎస్ కే ఆడమ్. కె. నరసింహ, మారం రామస్వామి, వెంకట్ స్వామి, సురేష్ పటేల్, సంధ్యరాణి, భాను ప్రసాద్ పాల్గొన్నారు.