
బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ లెటెస్ట్ ఫిల్మ్ ‘రామ్ సేతు’ ట్రైలర్ చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో నడుస్తుంది’ అని నటుడు ‘నాజర్’ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. రామ్ సేతును కూల్చివేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. కోర్టు దగ్గర నినాదాలు చేస్తుంటారు. శ్రీరాముడిపై ఉన్న నమ్మకాన్ని ఎలా సవాల్ చేయగలుగుతావ్ అని నాజర్ అడగగా.. నాకు తెలిసిన సమర్థుడు ఒకడున్నాడు.. అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ‘అక్షయ్ కుమార్’ కనిపిస్తాడు. పురావస్తు పరిశోధకుడిగా అక్షయ్ కుమార్ విభిన్నమైన గెటప్ లో కనిపిస్తాడు.
‘నా పనే ఇతిహాసాల్లోని నిజాలను వెలుగులోకి తీయడం’ అక్షయ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఏడు వేల సంవత్సరాల కిందట జరిగిన చరిత్రను ఎలా వెలుగులోకి తీసుకొచ్చారు ? ఎదురైన ఇబ్బందులు ఏమిటీ అనే దానిపై సినిమాను రూపొందించారు. రామ చరిత్రను ధ్వంసం చేయడానికి తీవ్రవాదులు చేసిన ప్రయత్నాలను అక్షయ్ బృందం ఎలా ఎదుర్కొందో తెరపై చూడాల్సిందే. ప్రపంచంలో శ్రీరాముడికి వేల మందిరాలున్నాయి... కానీ రామ సేతు ఒక్కటే ఉంది అనే డైలాగ్ తో ట్రైలర్ ఎండింగ్ అవుతుంది. సినిమాలో యువ కథానాయకుడు సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. జాక్వలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ బరుచాలు నటించారు. దీపావళి పండుగ సందర్భగా 25వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.