తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అటు రంజాన్ సందర్భంగా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీ, మిరాలం ఈద్గా, చార్మినార్ పరిసర ప్రాంతాలతో పాటు మాసబ్ ట్యాంక్ హాకీ మైదానం, సికింద్రాబాద్, రాణిగంజ్ తదితర చోట్ల.. ఉదయం 8గంటల నుంచి 11.30గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
రంజాన్ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ గవర్నర్ తమిళి సై ‘ఈద్-ఉల్-ఫితర్’ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దైవ చింతన స్ఫూర్తితో రంజాన్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తారు. అల్లా దీవెనలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు.