Ravindra Jadeja: ఆశాపురా దేవిని దర్శించుకున్న జడేజా దంపతులు

Ravindra Jadeja: ఆశాపురా దేవిని దర్శించుకున్న జడేజా దంపతులు

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, తన భార్య రివాబాతో కలిసి ఆశాపురా దేవిని దర్శించుకున్నారు. గుజరాత్,  కచ్‌లోని అన్నపూర్ణా దేవి అవతారమైన ఆషాపురా మాత దేవాలయం 14వ శతాబ్దానికి చెందినదిగా ప్రసిద్ధి. జడేజా రాజ్‌పుత్‌ల ప్రధాన దేవత. జడేజా దంపతులు విగ్రహం ముందు చేతులు జోడించి ఆశాపురా దేవి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

జనవరి 25 నుంచి స్వదేశంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ మొదటి రెండు టెస్టుల కోసం శుక్రవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించగా.. అందులో జడేజాకు చోటు దక్కింది. పేరుకు నలుగురు స్పిన్నర్లను ఎంపికచేసినా మొదటి రెండు టెస్టుల్లో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా ఆడటం  దాదాపు ఖాయం.  ఒకవేళ మూడో స్పిన్నర్ కావాలనుకుంటే అక్షర్ పటేల్‌ను తీసుకునే అవకాశం ఉంది.

కాగా, ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో కేవలం ఒక టెస్టు మాత్రమే ఆడాడు. వెన్ను నొప్పి కారణంగా సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ చోటు దక్కించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

మొదటి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మాన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, ధ్రువ్‌ జురెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌.