దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లు ఒకొక్కరు ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు కుటుంబంతో గడుపుతుంటే.. మరికొందరు తమ ప్రేమికురాళ్లతో బీచ్ల వెంట తిరుగుతున్నారు. ఇంకొందరు తమకు నచ్చినట్లుగా ప్రకృతితో మమేకమయ్యారు. ఇదిలావుంటే, భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎద్దుల బండిపై విహరిస్తూ తన విరామ సమయాన్ని గడుపుతున్నారు.
భారత జట్టు.. సఫారీ పర్యటనను విజయవంతంగా ముగించిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ ను 2-1 తేడాతో చేజిక్కించుకున్న టీమిండియా.. టెస్ట్, టీ20 సిరీస్లను డ్రాతో సరిపెట్టుకుంది. ఈ పర్యటన నుంచి స్వదేశానికి చేరుకున్న భారత జట్టు తదుపరి సిరీస్లో జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో తలపడాల్సి ఉంది. అందుకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉండడంతో భారత క్రికెటర్లు ఈ తీరిక సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జడేజా తన సొంతూరు రాజ్కోట్లో ఎద్దుల బండిపై విహరిస్తున్నారు. అతను ఎద్దుల బండి నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కార్లు, బైకులకు విరామం..
ఏమాత్రం తీరిక దొరికినా అధునాతన కార్లు, బైకులపై చక్కర్లు కొట్టే భారత క్రికెటర్లు.. ఇలా ఎద్దుల బండిపై కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ దృశ్యాలు చూసి కొందరు నెటిజన్లు తమ ఎద్దుల బండితో తమకున్న చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.
గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన జడేజా, రెండో టెస్టులో ఆడారు. ఈ టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. కేప్ టౌన్ వేదికగా ప్రోటీస్తో జరిగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి, కేప్ టౌన్ గడ్డపై విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా అవతరించింది.