
న్యూఢిల్లీ: ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్ బదిలీ కావడం వల్ల 2025–-26 ఆర్థిక సంవత్సరంలో దేశ ద్రవ్య లోటు... జీడీపీలో 4.2 శాతానికి తగ్గొచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిపోర్ట్ వెల్లడించింది. ఇది బడ్జెట్లో అంచనా వేసిన 4.5 శాతం కంటే తక్కువ. 2025–-26 కేంద్ర బడ్జెట్లో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి రూ.2.56 లక్షల కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని అంచనా వేసింది.
ఆర్బీఐ ఇటీవల రికార్డు స్థాయిలో రూ.2.69 లక్షల కోట్లను బదిలీ చేయాలని నిర్ణయించడంతో, వాస్తవ రాబడి అంచనాలను అధిగమించనుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన రూ.2.1 లక్షల కోట్ల కంటే 27.4 శాతం ఎక్కువ. ఈ అదనపు ఆదాయం ప్రభుత్వానికి ఆర్థికపరమైన వెసులుబాటును కల్పిస్తుంది.
ఇది ద్రవ్య లోటును బడ్జెట్ అంచనా స్థాయి నుంచి 20 నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గించి, జీడీపీలో 4.2 శాతానికి చేర్చగలుగుతుంది. ఈ డబ్బును కీలక రంగాలలో పెట్టుబడి పెట్టడానికి వాడుకునే అవకాశం కూడా ఉంది. ఆర్బీఐ విదేశీ మారక మార్కెట్లో చురుకుగా పాల్గొనడంతోపాటు డాలర్ల విక్రయాల వల్ల గణనీయమైన లాభాలను ఆర్జించింది. 2025 జనవరిలో ఆసియా కేంద్ర బ్యాంకులలో ఆర్బీఐ అతిపెద్ద విదేశీ మారక నిల్వల విక్రేతగా నిలిచింది. దేశీయ, విదేశీ సెక్యూరిటీల నుంచి లభించిన వడ్డీ ఆదాయం స్థిరంగా పెరిగింది.