
- నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీతో పంజాబ్ కింగ్స్ ఢీ
- ఆర్సీబీతో పంజాబ్ కింగ్స్ ఢీ
- తొలి టైటిల్ కోసం రెండు మేటి జట్ల అమీతుమీ
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో లైవ్
ఐపీఎల్లో ఆరంభం నుంచీ బరిలో నిలిచినా ఒక్కసారి కూడా కప్పు నెగ్గని జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్. ఈ ఒక్క పోలిక తప్పితే లీగ్లో ఇవి భిన్నధ్రువాల లాంటి జట్లు. స్టార్డమ్, ఫ్యాన్డమ్లో ఆర్సీబీది ఓ రేంజ్. ఫలితాలతో సంబంధం లేకుండా ఆ జట్టును పిచ్చిగా ఆరాధించే కోట్లాదిమంది అభిమానులున్నారు. అందుకు కారణం సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ.
ఇంకోవైపు మెగా లీగ్లో పంజాబ్ కింగ్స్ టీమ్ చివరి స్థానం కోసం పోటీపడ్డ సీజన్లే ఎక్కువ. పేరు మార్చుకున్నా మారని ఆ టీమ్ రాత ఈసారి మారేలా కనిపిస్తోంది. అందుకు కారణం శ్రేయస్ అయ్యర్.
గతేడాది కోల్కతాను విన్నర్గా నిలిపిన అయ్యర్ అదే పంతం, సంకల్పంతోఇప్పుడు పంజాబ్నూ చాంపియన్ చేసేందుకు అడుగు దూరంలో నిలిచాడు.దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించి ఆర్సీబీ జట్టుతో కలిసి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని ఆశిస్తున్న కోహ్లీ కలకు అడ్డుగా ఉన్నాడు.
ఇరు జట్ల మధ్య నేడే మెగా ఫైనల్. మరి కోహ్లీ కప్పు కల నెరవేరుతుందా? అయ్యర్ పంతం నెగ్గుతుందా? ఐపీఎల్లో కొత్త చాంపియన్గా ఎవరు అవతరిస్తారు?
అహ్మదాబాద్: 70 లీగ్ మ్యాచ్లు.. మూడు ప్లేఆఫ్స్ పోరాటాల తర్వాత రెండు మేటి జట్ల మధ్య ఐపీఎల్ 18వ సీజన్ మెగా ఫైనల్కు రంగం సిద్ధమైంది. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే టైటిల్ ఫైట్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో నెగ్గి తొలిసారి ఐపీఎల్ చాంపియన్గా నిలవాలని ఇరు జట్లూ తహతహలాడుతున్నాయి. ఈ పోరులో ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, పంజాబ్ లీడర్ శ్రేయస్ అయ్యర్పై అందరి ఫోకస్ ఉండనుంది. నాలుగోసారి ఫైనల్ ఆడుతున్న కోహ్లీకి సపోర్ట్గా వేలాది మంది ఫ్యాన్స్ నం. 18 జెర్సీలతో స్టేడియానికి పోటెత్తే అవకాశం ఉంది. ఇంకోవైపు మూడు జట్లను ఫైనల్ చేర్చిన (ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్) కెప్టెన్గా అరుదైన రికార్డు సృష్టించిన అయ్యర్ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని కోరుకుంటున్నాడు. లీగ్ దశలో తలపడ్డ మ్యాచ్ల్లో ఇరు జట్లూ చెరోసారి నెగ్గగా.. క్వాలిఫయర్–1లో ఆర్సీబీ గెలిచింది. వరుసగా మూడోసారి పంజాబ్పై పైచేయి సాధించి ట్రోఫీని అందుకోవాలని రజత్ పటీదార్ కెప్టెన్సీలోని బెంగళూరు పట్టుదలగా ఉంది. గత రెండు పరాజయాలకు ఫైనల్లో ఆర్సీబీపై
ప్రతీకారం తీర్చుకొని కప్పు సొంతం చేసుకోవాలని అయ్యర్సేన కోరుకుంటోంది.
పంజా విసురుతుందా?
సొంతగడ్డపై క్వాలిఫయర్–1లో ఆర్సీబీ చేతిలో ఎదురైన ఘోర ఓటమి నుంచి అయ్యర్ కెప్టెన్సీలోని కింగ్స్ గొప్పగా పుంజుకుంది. క్వాలిఫయర్– 2లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించి 11 ఏండ్ల తర్వాత ఫైనల్ చేరుకుంది. పాయింట్ల పట్టికలో తరచుగా సెకండాఫ్లో నిలిచే కింగ్స్ ఈ సారి కెప్టెన్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్ నేతృత్వంలో సంచలన మార్పు సాధించింది. లీడర్గానే కాకుండా బ్యాటర్గానూ అయ్యర్ (603రన్స్) జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. గత పోరులో ముంబైపై అతని బ్యాటింగ్ అద్భుతమనే చెప్పొచ్చు. ప్రభ్సిమ్రన్, జోష్ ఇంగ్లిస్, ప్రియాన్ష్ ఆర్య, శశాంక్ సింగ్ బ్యాటింగ్లో అయ్యర్కు తోడుగా ఉన్నారు. ఈ సీజన్లో పంజాబ్ విజయాలకు ఆ టీమ్ టాపార్డరే పునాది అనొచ్చు. సీజన్ మధ్యలో జట్టులోకి వచ్చిన జోష్ ఇంగ్లిస్తో పాటు టాప్–3లోని ప్రతీ ఒక్కరూ 160 ప్లస్ స్ట్రైక్ రేట్తో నిలిచారు. కానీ, వీళ్లను కట్టడి చేసిన ఏకైక టీమ్ ఆర్సీబీనే. బెంగళూరు పేసర్లు తమ హార్డ్ లెంగ్త్ బాల్స్తో పంజాబ్ టాపార్డర్ను 53/4, 76/4, 38/4 స్కోర్లతో దెబ్బకొట్టారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం ఆర్సీబీతో 3 మ్యాచ్ల్లో 7, 6, 2 స్కోర్లు మాత్రమే చేశాడు. ఫైనల్లో ఆర్సీబీ బౌలింగ్ దాడిని బ్యాటర్లు సమర్థవంతంగా తిప్పికొడితేనే పంజాబ్ తన లక్ష్యాన్ని అందుకోగలదు. ఫ్లాట్ పిచ్పై గత పోరులో ముంబైని కట్టడి చేసిందనే చెప్పొచ్చు. కానీ, ఆర్సీబీపై అర్ష్దీప్ నేతృత్వంలోని పేస్ విభాగం ఇంకా బాగా ఆడాల్సి ఉంటుంది. చేతి వేలి గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ చహల్ గత పోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ, తన మాజీ ఫ్రాంచైజీపై చహల్ నుంచి పంజాబ్ మెరుగైన పెర్ఫామెన్స్ ఆశిస్తోంది.
పిచ్ ఎలా ఉంది?
అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. ఫైనల్ ఎర్ర, నల్ల మట్టితో కూడిన సెంటర్ వికెట్పై జరగనుంది. ఇక్కడ ఎనిమిది మ్యాచ్ల్లో 11 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఆరుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే నెగ్గాయి. ఇక, మంగళవారం రాత్రి వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించినా.. రిజర్వ్ డే ఉంది.
ఆర్సీబీ.. కోహ్లీ కోసం
గత సీజన్లలో వెంటాడిన సమస్యలను అధిగమించిన ఆర్సీబీ ఈసారి అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. ఆరంభం నుంచి చివరి వరకూ అద్భుతంగా ఆడిన బెంగళూరు క్వాలిఫయర్– 1లో పంజాబ్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు వచ్చింది. నాలుగు రోజుల విరామం తర్వాత ప్రశాంతంగా ఆఖరాటకు సిద్ధమైంది. ప్రతీ సీజన్లానే కింగ్ కోహ్లీ (614 రన్స్) టాపార్డర్లో పరుగుల వరద పారించాడు. ఈసారి విరాట్తో పాటు మరికొందరు కూడా సమష్టిగా రాణించడం ఆ జట్టుకు కలిసొచ్చింది. ఫిల్ సాల్ట్ ఇండియా సూపర్ స్టార్కు సరైన ఓపెనింగ్ పార్ట్నర్గా నిలిచాడు. ఈ ఇద్దరూ ఇచ్చే ఆరంభం ఫైనల్లో కీలకం కానుంది. మయాంక్ అగర్వాల్, కెప్టెన్ రజత్ పటీదార్, జితేష్ శర్మ కూడా సత్తా చాటుతున్నారు.
గత రెండు మ్యాచ్లకు దూరమైన హిట్టర్ టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్కు ఫిట్గా ఉంటే జట్టు బలం మరింత పెరుగుతుంది.18వ సీజన్లో ఆర్సీబీ సక్సెస్కు మరో ప్రధాన కారణం ఆ టీమ్ సూపర్ బౌలింగ్. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్ (21 వికెట్లు) ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆఖరాటలో మరిన్ని వికెట్లు తీసి జట్టు కలను నెరవేర్చాలని అతను పట్టుదలగా ఉన్నాడు. యశ్ దయాల్, భువనేశ్వర్ కూడా నిలకడగా రాణిస్తున్నారు. క్వాలిఫయర్–1లో పంజాబ్ మిడిలార్డర్ను దెబ్బకొట్టిన స్పిన్నర్ సుయాశ్ మరోసారి అదే పెర్ఫామెన్స్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా ఇన్నేండ్లుగా పెద్దన్నగా తమ జట్టును తీర్చిదిద్దిన విరాట్ కోహ్లీ కెరీర్లో లోటుగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని ఎలాగైనా సాధించాలని ఆర్సీబీ ఆటగాళ్లంతా పట్టుదలగా ఉన్నారు.