సీఎం కేసీఆర్ బాస్ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఖాయమని.. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎంపీ తనకు చెప్పారన్నారు. సీట్ల పంపకాలు కూడా జరిగాయన్నారు. బీఆర్ఎస్ 9 సీట్లు..బీజేపీ 7 సీట్లలో పోటీ చేస్తుందన్నారు. మిగిలిన మరో స్థానలో ఎంఐఎం పోటీచేస్తుందన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే బీఆర్ఎస్,బీజేపీ లక్ష్యమన్నారు రేవంత్. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని.. నిజామాబాద్ లో సాక్షాత్తు మోడీనే ఈ బంధాన్ని బయటపెట్టారన్నారు మోదీ , కేసీఆర్ మధ్య పొత్తు బయటపడ్డాక ఎంఐఎం విధానమేంటో చెప్పాలన్నారు రేవంత్.
బీఆర్ఎస్ ను గెలిపించడానికే మోదీ పదే పదే రాష్ట్రానికి వస్తున్నారని రేవంత్ అన్నారు. బీజేపీకి మొదటి నుంచి బీఆర్ఎస్ మద్దతుగా ఉందన్నారు. కీలక బిల్లుల ఆమోదంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చిందని చెప్పారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో విపక్ష సీఎంలపై ఈడీ దాడులు జరిగాయని..మరి సీఎం కేసీఆర్ పై ఎందుకు ఈడీ దాడులు జరగలేదని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ అవినీతి చేశారని ఆరోపణలు చేసినప్పుడు మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు రేవంత్. బీఆర్ఎస్ అవినీతి చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోకపోవడానికి వాటాలు,మూటాలే కారణమని ఆరోపించారు. కొడుకును సీఎం చేయడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంపై కేసీఆర్ ప్రధాని మోడీతో చర్చించారని తెలిపారు. వీరిద్దరు ఒకటేనని చెప్పడానికి మోడీ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు రేవంత్.