వరల్డ్ నంబర్ వన్ హోదా..ఇలా అయితే ఎలా?

వరల్డ్ నంబర్ వన్ హోదా..ఇలా అయితే ఎలా?

వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌ హోదా. ప్రపంచం మెచ్చిన కెప్టెన్‌‌. నిఖార్సైన టెస్టు బ్యాట్స్‌‌మెన్‌‌. అద్భుతమైన బౌలర్లు..! పైగా టెస్టు చాంపియన్‌‌షిప్‌‌లో ఓటమి ఎరుగని రికార్డు..! ఇన్ని అనుకూలతల మధ్య న్యూజిలాండ్‌‌తో టెస్టు సిరీస్‌‌ బరిలో నిలిచిన టీమిండియా ఇంత చిత్తుగా ఓడిపోతుందని సగటు అభిమాని ఊహించలేదు..! గతంలో మన జట్టు ఇంతకంటే దారుణమైన ఓటములు మూటగట్టుకున్నా.. ఈ పరాజయాన్ని అంత త్వరగా మరిచిపోలేం..!  ఫలితం కంటే ఓడిన తీరే బాధిస్తోంది..! 

టన్నుల కొద్ది పరుగులు చేసిన బ్యాట్స్‌‌మెన్‌‌ రెండంకెలు దాటలేక ఇబ్బంది పడుతుంటే.. జట్టంతా కలిసి రెండొందలు చేసేందుకు కష్టపడుతుంటే.. పోరాటమే లేకుండా కివీస్‌‌కు దాసోహమన్నాక మనది నంబర్‌‌ వన్ జట్టే అని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది..! ఇంత ఘోరమైన ఓటమి తర్వాత కూడా  టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ చాలా విషయాల్లో కోహ్లీసేన ఆటతీరును వెంటనే సమీక్షించుకోవాల్సిందే..!  పరిస్థితి ఇలానే ఉంటే మున్ముందు విదేశీ టూర్లల్లో ఇండియాను సాధారణ ప్రత్యర్థిగానే పరిగణించాల్సి రావొచ్చు..!

పునాదే లేదాయె

ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నిర్మించి పునాది వేస్తే.. మిగతా బ్యాట్స్‌‌మెన్‌‌ దాన్ని భారీ స్కోరుగా మలచాలి. కానీ, ఈ సిరీస్‌‌లో ఇండియా యువ ఓపెనర్లు మయాంక్‌‌ అగర్వాల్‌‌, పృథ్వీ షా కనీసం ఫిఫ్టీ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ఇవ్వలేకపోయారు. నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లో 16, 27, 30, 8 రన్స్‌‌ జోడించి తీవ్రంగా నిరాశ పరిచారు. చెరో హాఫ్‌‌ సెంచరీతో వ్యక్తిగతంగా బాగానే ఆడారు కానీ, ఓపెనింగ్‌‌ జోడీగా మాత్రం సక్సెస్‌‌ కాలేకపోయారు. అదే సమయంలో కివీస్‌‌ ఓపెనర్లు టామ్‌‌ లాథమ్‌‌, టామ్‌‌ బ్లండెల్‌‌ మాత్రం ఈ విషయంలో విజయం సాధించారు. సెకండ్​ టెస్ట్​  ఛేజింగ్​లో  ఫస్ట్‌‌ వికెట్‌‌కు వాళ్లిద్దరూ 103 రన్స్‌‌ జోడించడంతో కివీస్‌‌ ఈజీగా గెలిచింది. కానీ, సిరీస్‌‌ నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లో కలిపి కూడా మయాంక్‌‌– పృథ్వీ జంట వంద పరుగులు జత చేయలేకపోవడం విచారకరం.

వాల్‌‌కు ఏమైంది?

రాహుల్‌‌ ద్రవిడ్‌‌ తర్వాత ఇండియాకు దొరికిన మరో ఆణిముత్యం చతేశ్వర్‌‌ పుజారా.  కానీ, ఈ మధ్య అతను జట్టును ఆదుకోవడం లేదు. 2018లో ఆస్ట్రేలియాలో హిస్టారికల్‌‌ టెస్టు సిరీస్‌‌ విజయంలో కీలక పాత్ర పోషించిన చతేశ్వర్‌‌ తర్వాత ఆడిన 14 ఇన్నింగ్స్‌‌ల్లో సెంచరీ చేయలేకపోయాడు. విదేశాల్లో జట్టు అతనిపై ఎక్కువ ఆధారపడుతుంది. కానీ, వెస్టిండీస్‌‌ టూర్‌‌తో పాటు ఇప్పుడు కివీస్‌‌లో కూడా ఆకట్టుకోలేపోయాడు. మొదటి టెస్టులో అతి జాగ్రత్తతో ఇబ్బంది పడ్డ పుజారా.. సెకండ్‌‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌‌లో క్రీజులో పాతుకుపోయిన తర్వాత సహనం కోల్పోయి వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. టీ నుంచి వచ్చిన వెంటనే తన శైలికి భిన్నంగా పుల్‌‌షాట్‌‌ ఆడి వికెట్‌‌ పారేసుకున్నాడు. వేగం విషయంలో కెప్టెన్‌‌ కోహ్లీ అభిప్రాయం ఎలా ఉన్నా.. టెస్టు స్పెషలిస్ట్‌‌గా క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్‌‌ చేయాలో పుజారాకు పూర్తి అవగాహన ఉంది. అలాంటి వ్యక్తి మొదటి రోజు మూడో సెషన్‌‌లోనే ఓపిక కోల్పోయి చెత్త షాట్‌‌ ఆడడం ఆమోదయోగ్యం కాదు. అదే సమయంలో పుజారాపై ఒత్తిడి పెంచకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడేలా మేనేజ్‌‌మెంట్‌‌ అతనికి స్వేచ్ఛనిస్తే జట్టుకు మంచిది.

రహానె ఇక కష్టమేనా

టీ20ల్లో చోటు లేదు. వన్డేల్లో అవకాశం రావడం లేదు. మిగిలింది టెస్టులే. న్యూజిలాండ్‌‌లో ఆట చూశాక అజింక్యా రహానె లాంగ్‌‌ ఫార్మాట్‌‌ కెరీర్‌‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకప్పుడు టీమిండియా ట్రబుల్‌‌ షూటర్‌‌గా పేరు తెచ్చుకున్న రహానె పై నమ్మకం ఉంచలేని పరిస్థితి వచ్చింది. ఈ టూర్‌‌లో  అతను టెక్నికల్‌‌ బలహీనతలు బయటపెట్టాడు. ముఖ్యంగా సెకండ్‌‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌‌లో వికెట్‌‌ పారేసుకున్న విధానం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. నీల్‌‌ వాగ్నర్‌‌ వేసిన స్లో షార్ట్‌‌ బాల్‌‌కు క్లీన్‌‌బౌల్డ్‌‌ అయిన రహానెలో టెక్నిక్‌‌, పేషెన్స్‌‌ రెండూ లోపించాయి. వైస్‌‌ కెప్టెన్‌‌ అయి ఉండి, మిడిలార్డర్‌‌ను నడిపించాల్సిన బాధ్యత తనపై ఉన్నా కూడా అతను ఇంత నిర్లక్ష్యంగా ఆడడం తగదు. లోకేశ్‌‌ రాహుల్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ లాంటి టాలెంటెడ్‌‌ ప్లేయర్లు అవకాశం కోసం ఎదురు చూస్తుండగా.. రహానె స్వయంకృతంతో వారికి దారి ఇచ్చేలా కనిపిస్తున్నాడు.

నాణ్యమైన స్వింగ్‌‌ బౌలర్‌‌ కావాల్సిందేనా..

టెస్టు సిరీస్‌‌లో వైట్‌‌వాష్‌‌ అవడంతో బౌలర్ల తప్పిదం కూడా కొంత ఉంది. అయితే, నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లోనూ బ్యాట్స్‌‌మెన్‌‌ మంచి స్కోర్లు ఉంచకపోవడంతో మొదటి నుంచే వారిపై ఒత్తిడి పడింది. ఇలాంటి టైమ్‌‌లో వాళ్ల నుంచి అద్భుతాలనే ఆశించాల్సి వచ్చింది. అయితే, కొన్ని సందర్భాల్లో అద్భుతంగా బౌలింగ్‌‌ చేసిన మనోళ్లు కీలక సమయాల్లో పట్టు విడిచారు. ముఖ్యంగా టెయిలెండర్లను త్వరగా ఔట్‌‌ చేయలేకపోయారు. దీనికి ప్రధాన కారణం మన టీమ్‌‌లో నాణ్యమైన స్వింగ్‌‌ బౌలర్‌‌ లేకపోవడమే. బంతి గాల్లో ఉన్నప్పుడు మంచి మూవ్‌‌మెంట్‌‌ రాబట్టే భువనేశ్వర్‌‌ కుమార్‌‌, దీపక్‌‌ చహల్‌‌ లాంటి బౌలర్‌‌ లేని లోటు కనిపించింది. అదే టైమ్‌‌లో కివీస్‌‌ బౌలర్లు బౌల్ట్‌‌, సౌథీ మూవింగ్‌‌ బాల్స్‌‌తోనే టీమిండియాను దెబ్బకొట్టారు.  బుమ్రా, ఇషాంత్‌‌, షమీ మంచి పేస్‌‌ రాబట్టినా వైవిధ్యం లేక  వికెట్లు తీయలేకపోయారు. దాంతో  ఫారిన్‌ టూర్లకు  వెళ్లేప్పుడు నాణ్యమైన స్వింగ్​ బౌలర్‌‌ను తీసుకెళ్లాల్సిందే అన్న విషయం స్పష్టమైంది.

కీపర్లతో కుర్చీలాట సబబేనా?

డిఫరెంట్‌‌ ఫార్మాట్లకు డిఫరెంట్‌‌ వికెట్‌‌ కీపర్లు అనే కాన్సెప్ట్‌‌ తెలుసు. చాలా దేశాలు దీన్ని వాడుతున్నాయి. కానీ, ఒక్కో వేదికకు ఒక్కో కీపర్‌‌ అనే కొత్త, చెత్త కాన్సెప్ట్‌‌ను ప్రవేశపెట్టిన ఘనత ఇండియాకే చెందాలి. దీనివల్ల జట్టు ఎంతగా నష్టపోతుందో చెప్పాల్సిన అవసరం లేదు. వృద్ధిమాన్‌‌ సాహానే బెస్ట్‌‌ కీపర్‌‌ అని ఒప్పుకుంటున్న కోహ్లీ  విదేశాల్లో అతడిని కాదని పంత్‌‌కు చాన్సిస్తున్నాడు. కానీ, ఎన్ని అవకాశాలు వచ్చినా నిరూపించుకోలేకపోతున్న పంత్‌‌ మూవింగ్‌‌ బాల్స్‌‌కు అడ్డదిడ్డమైన షాట్లు ఆడి వికెట్‌‌ పారేసుకుంటున్నాడు. పోనీ అతని కీపింగ్‌‌ అయినా బాగుందా అంటే అదీ లేదు. సెకండ్‌‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌‌లో అతని కారణంగా ఏకంగా 20 బైస్‌‌ వచ్చాయి. వాటిని అడ్డుకొని ఉంటే ఇండియా కాస్త ఎక్కువ లీడ్‌‌ సాధించి మ్యాచ్‌‌పై పట్టు సాధించే అవకాశం ఉండేది. మరి ఇప్పటికైనా కీపర్‌‌ విషయంలో కెప్టెన్‌‌, టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌

బలమే బలహీనత అయితే

ఈ సిరీస్‌‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం విరాట్‌‌ కోహ్లీ వైఫల్యమే. బ్యాట్స్‌‌మన్‌‌గానే కాకుండా కెప్టెన్‌‌గా కూడా కోహ్లీ పూర్తిగా నిరాశ పరిచాడు. నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లో కలిపి 38 పరుగులే చేసిన విరాట్‌‌ తన కెరీర్‌‌లో రెండోసారి బ్యాడ్‌‌ ఫేజ్‌‌లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. 2014లో ఇంగ్లండ్‌‌ టూర్‌‌లోనూ కోహ్లీ పూర్తిగా ఫెయిలయ్యాడు. ఔట్‌‌ సైడ్‌‌ ఆఫ్‌‌ స్టంప్‌‌ మీదుగా వెళ్తున్న బాల్స్‌‌ను సరిగ్గా ఆడలేక వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. కానీ, నాలుగేళ్ల తర్వాత మరోసారి ఇంగ్లండ్‌‌ వెళ్లిన విరాట్‌‌ అద్భుతంగా బ్యాటింగ్‌‌ చేశాడు. మూవింగ్‌‌ బాల్స్‌‌ విషయంలో తన బలహీనతలు సరిదిద్దుకొని ఇంగ్లిష్‌‌ టీమ్‌‌కు దీటుగా జవాబిచ్చాడు. కానీ, కివీస్‌‌ పిచ్‌‌లపై మాత్రం అతను మూవింగ్‌‌ బాల్స్‌‌ను సరిగ్గా ఎదుర్కోలేకపోయాడు. చేసిన తప్పును రెండోసారి చేసేందుకు ఇష్టపడని విరాట్‌‌ రెండో టెస్టులో ఒకే రకమైన డెలివరీలకు వికెట్‌‌ ఇచ్చుకోవడం గమనార్హం. బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌కు కొండంత అండలా నిలిచే కోహ్లీనే కాడి వదిలేయడంతో మిగతా బ్యాట్స్‌‌మెన్‌‌పై ఒత్తిడి పెరుగుతోంది. కౌంటర్‌‌- అటాక్‌‌ చేయలేక జట్టు డిఫెన్స్‌‌లో పడిపోతోంది. కెప్టెన్‌‌గా కూడా విరాట్‌‌ కోహ్లీది వైఫల్యమే. తుది జట్టు ఎంపిక నుంచి బౌలర్లను మార్చడం, ఫీల్డింగ్‌‌ ఏర్పాటు వరకూ అతని కెప్టెన్సీని మాజీలు తప్పుపడుతున్నారు. ఫామ్‌‌లో ఉన్న లోకేశ్‌‌ రాహుల్‌‌కు రెస్ట్‌‌ ఇవ్వడం, సాహా ఉన్నా పంత్‌‌వైపే మొగ్గు చూపడం, కొత్త బాల్‌‌ను ఉపయోగించుకోవడంలో వైఫల్యం  ఈ సిరీస్‌‌లో కోహ్లీ చేసిన తప్పిదాలు. వీటిని సరిదిద్దుకోకపోతే.. ఫారిన్‌‌ టూర్లలో మరిన్ని ఓటములు తప్పవు.కుర్చీలాట కట్టిపెడితే మంచింది. సాహాను కొనసాగించడమో, శ్రీకర్​ భరత్​లాంటి యంగ్​స్టర్​ను తెరపైకి తేవడమో చేయాలి.