
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లారు. సీఎం కేసీఆర్తో సమావేశమై.. ఈడీ కేసుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఫాంహౌస్ కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేసిన తర్వాత మొదటిసారి ఆయన కేసీఆర్ను కలిశారు. విచారణకు హాజరుకావాలని ఈడీ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఫాంహౌస్ కేసులో పైలెట్ రోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ సమన్లపై స్టే ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం నిరాకరించింది. కేసు తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోగా ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రోహిత్ రెడ్డి తరఫున వైసీపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పార్టీ మారాలని తనకు వంద కోట్ల ఆఫర్ ఇచ్చారని రోహిత్ రెడ్డి ధర్మాసనానికి చెప్పారు. ఆఫర్ చేశారే తప్ప డబ్బు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆర్థిక వావాదేవీలు జరగనందున కేసు ఈడీ పరిధిలోకి రాదని రోహిత్ రెడ్డి తరఫు లాయర్ వాదించారు. ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని కోర్టుకు విన్నవించారు. వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందని ఆరోపించారు.