అహ్మదాబాద్: సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు టీమిండియాను ఆదివారం ప్రకటించారు. కొత్త చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి ఆధ్వర్యంలో తొలిసారి సమావేశమైన కమిటీ.. 15 మందితో కూడిన టీమ్ను ఎంపిక చేసింది. ఆరు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ సిరీస్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బ్యాక్ ఇంజ్యూరీ ఆపరేషన్ నుంచి కోలుకున్న అతను పూర్తి ఫిట్నెస్ సాధించాడు. మొన్న ముగిసిన డీవై పాటిల్ టీ20 టోర్నీలో వరుసగా రెండు సెంచరీలు బాదడంతో సెలెక్టర్లు టీమ్లోకి తీసుకున్నారు. కాలిపిక్క కండర గాయం నుంచి పూర్తిగా కోలుకోని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. ఈ నెలాఖరున మొదలయ్యే ఐపీఎల్తో ఈ ముంబైకర్ తిరిగి బ్యాట్ పట్టనున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ శిఖర్ ధవన్, స్పోర్ట్స్ హెర్నియాతో ఇబ్బందిపడ్డ పేసర్ భువనేశ్వర్ తిరిగి టీమ్లో చోటు దక్కించుకున్నారు. ధవన్ రాకతో న్యూజిలాండ్ సిరీస్లో వరుసగా విఫలమైన మయాంక్ అగర్వాల్పై వేటు పడింది. శార్దూల్ ఠాకూర్, శివం దూబేను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. అయితే కివీస్తో టెస్ట్ సిరీస్లో నిరాశపర్చిన పృథ్వీ షా మాత్రం ప్లేస్ నిలబెట్టుకున్నాడు. సిరీస్లో భాగంగా ఈనెల 12 (ధర్మశాల), 15 (లక్నో), 18 (కోల్కతా)న వరుసగా మూడు మ్యాచ్లు జరుగుతాయి.
జట్టు: విరాట్ (కెప్టెన్), ధవన్, పృథ్వీ, రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్, హార్దిక్, జడేజా, భువనేశ్వర్, చహల్, బుమ్రా, సైనీ, కుల్దీప్, గిల్.