
పాట్నా: ఈ ఫొటో చూడగానే కొత్తగా వేసిన తారు రోడ్డు మధ్యలో పెద్దపెద్ద చెట్లు మొలిచినట్లు లేదూ.. అవును మీరు అనుకున్నది నిజమే. కాకపోతే ఒక్కటే తేడా. కొత్తగా పోసిన రోడ్డు మధ్యలో చెట్లు మొలవలేదు.. చెట్లను రోడ్డు మధ్యలో అలానే ఉంచి కొత్తగా తారు రోడ్డు పోశారు. బీహార్ రాజధాని పాట్నాకు 50 కిలోమీటర్ల దూరంలో ఒక రోడ్డు కాంట్రాక్టర్, జిల్లా అధికార యంత్రాంగం చేసిన నిర్వాకం ఇది. ఈ ఘన కార్యానికి సంబంధించిన రోడ్డు ఫొటో నెట్టింట వైరల్ అయింది.
ఈ నిర్వాకానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్లోని జెహనాబాద్లో 100 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. జెహనాబాద్లోని పాట్నా-గయా మెయిన్ రోడ్ అది. 7.48 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. అయితే.. ఇక్కడే వాళ్లకో చిక్కొచ్చి పడింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చెట్లను నరికి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే విషయమై.. అనుమతుల కోసం అటవీ శాఖ అధికారులకు జిల్లా యంత్రాంగం విన్నవించుకుంది. చెట్లను నరికేసేందుకు అటవీ శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు.
ఒకవేళ.. చెట్లను నరికేయక తప్పదనుకుంటే 14 హెక్టార్ల అటవీ భూములను పరిహారంగా ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ముందు అటవీ శాఖ ప్రతిపాదన ఉంచింది. ఈ ల్యాండ్ కేటాయించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. ఇక.. ఏదైతే అదైందని 100 కోట్లు ఖర్చు చేసి చెట్లను నరికకుండానే.. చెట్లను అలానే ఉంచి కొత్తగా రోడ్డు పోశారు.
►ALSO READ | 800 గ్రాముల గోల్డ్, రూ.70 లక్షల వోల్వో కార్ ఇచ్చారు.. అయినా కట్నం కోసం చంపేశారు !
అయితే.. అధికారులు, కాంట్రాక్టర్ నిర్వాకంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనుమతి రాకపోతే.. ప్రత్యామ్నయాలను ఆలోచించాల్సింది పోయి చెట్లను అలానే ఉంచి రోడ్డు పోయడం ఏంటని స్థానిక ప్రజలు మండిపడ్డారు. రోడ్డు మధ్యలో చెట్లు అలాగే ఉండి.. రోడ్డు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని, ప్రాణాలను తిరిగి తీసుకురాగలరా అని స్థానికులు అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు.
🟥 A ₹100 crore road in Jehanabad, Bihar, leaves dozens of trees standing in the middle due to forest/wildlife department demands, sparking safety concerns and inter-department blame pic.twitter.com/1TyWi8lk1D
— BharatPaksh (@PakshForBharat) June 30, 2025