8 మంది పోలీసులను చంపిన వికాస్‌ దుబేపై రివార్డు పెంచిన పోలీసులు

8 మంది పోలీసులను చంపిన వికాస్‌ దుబేపై రివార్డు పెంచిన పోలీసులు
  • సమాచారం ఇస్తే రూ.2.5 లక్షలు ఇస్తామని ప్రకటన

లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడు వికాస్‌ దుబేపై పోలీసులు రివార్డు పెంచారు. ఇప్పటి వరకు రూ.50 వేలు ఉన్న రివార్డును 2.5లక్షలకు పెంచుతూ యూపీ డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ హెచ్‌ సీ. అవస్థి ఆదేశాలు జారీ చేశారని అడిషనల్‌ డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ లా అండ్‌ ఆర్డర్‌‌ ప్రశాంత్‌ కుమార్‌‌ సోమవారం చెప్పారు. నిందితుడిపై ముందు 50వేలు ఉన్నరివార్డును లక్షకు పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు 2.5లక్షలకు పెంచారు. వికాస్‌కు సమాచారం అందించినట్లు అనుమానం ఉన్న నలుగురు పోలీస్‌ ఆఫీసర్లను సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. కాల్పులు జరిపిన తర్వాత పారిపోయిన వికాస్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని అన్నారు. ఈ మేరకు ఇండియా – నేపాల్‌ బోర్డర్‌‌లో కూడా పోస్టర్లు అంటించారు. వికాస్‌కు చెందిన బ్యాంక్‌ అకౌంట్లను ఇప్పటికే బ్లాక్‌ చేసిన పోలీసులు ఆయనకు చెందిన కార్‌‌లను సీజ్‌ చేశారు.