
- ఈ నెల 22న ప్రారంభించనున్న మంత్రి జగదీశ్ రెడ్డి
- వివరాలు వెల్లడించిన సుమధుర ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మధుసూదన్
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇస్కిల్ల గ్రామంలో శిథిలావస్థకు చేరిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రపంచ స్థాయి హంగులతో నిర్మించడం తనకు సంతోషంగా ఉందని సుమధుర ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ గుండా మధుసూదన్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే కల సాకారమైందన్నారు. దాదాపు రూ.2 కోట్లతో అత్యాధునిక వసతులతో ప్రభుత్వ స్కూల్కు కొత్త బిల్డింగ్ను నిర్మించామన్నారు. విశాలమైన క్లాస్రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, అంగన్ వాడీ గదులు, కిచెన్ రూమ్ వసతులను కల్పించామన్నారు.
ఆట స్థలంతో పాటు క్రీడా సామగ్రి, స్టూడెంట్లకు కావాల్సిన ఫర్నిచర్, బీరువాలను సమకూర్చామన్నారు. ఈ నెల 22న మంత్రి జగదీశ్ రెడ్డి స్కూల్ బిల్డింగ్ను ప్రారంభిస్తారని, చీఫ్ గెస్టుగా స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరుకానున్నట్లు మధుసూదన్ తెలిపారు. స్కూల్ బిల్డింగ్ నిర్మాణంతో పాటు ఇస్కిల్ల గ్రామంలో మౌలిక సదుపాయాలైన తాగునీటి కోసం ఆర్వో వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. స్కూల్ స్టూడెంట్లకు సైకిళ్లను అందజేశామని ఆయన తెలిపారు.