
- దేశమంతటా సముద్ర నాచు యూనిట్లు: కేంద్ర మంత్రి ఎల్. మురుగన్
హైదరాబాద్, వెలుగు: మత్స్యకారుల అభివృద్ధి కి ఆత్మనిర్భర్ స్కీం కింద రూ.20 వేల కోట్లను కేటాయించామని కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ చెప్పారు. ఆ నిధులతో ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ సౌలతుల కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్స్యకారులకు త్వరలో ‘కిసాన్ క్రెడిట్ కార్డు’లను ఇస్తామని చెప్పారు. దేశంలో సముద్ర నాచు పెంపకానికి ప్రోత్సాహం ఇస్తామని, నాచు యూనిట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శనివారం హైదరాబాద్లోని జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీబీ)కి వచ్చిన ఆయన.. పలు కార్యక్రమాలను ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మత్స్యకారులు, మహిళల అభివృద్ధి కోసం ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ (పీఎంఎంఎస్వై) కింద ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సముద్ర నాచుకు మంచి మెడిసినల్ గుణాలున్నాయని, నాచు పెంపకాన్ని మరింత ప్రోత్సహించేందుకు తమిళనాడులో సముద్రనాచు ఎకనామిక్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తర్వాత దేశమంతటా వాటిని ఏర్పాటు చేస్తామన్నారు.
మంచినీటి రొయ్యల పెంపకం కోసం బిహార్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ ఏర్పాటు చేసిన హేచరీని ఆయన వర్చువల్గా ప్రారంభించారు. మత్స్యకారులు, ఆక్వా రైతులకు పీఎంఎంఎస్వై మీద అవగాహన కల్పించేందుకు పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు.