మత్స్యకారుల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు

మత్స్యకారుల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు
  • దేశమంతటా సముద్ర నాచు యూనిట్లు: కేంద్ర మంత్రి ఎల్​. మురుగన్​ 

హైదరాబాద్, వెలుగు: మత్స్యకారుల అభివృద్ధి కి ఆత్మనిర్భర్ ​స్కీం కింద రూ.20 వేల కోట్లను కేటాయించామని కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఎల్​.మురుగన్​ చెప్పారు. ఆ నిధులతో ల్యాండింగ్​ సెంటర్లు, ఫిషింగ్​ హార్బర్లు, ప్రాసెసింగ్​ యూనిట్లు, కోల్డ్​ స్టోరేజీ సౌలతుల కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్స్యకారులకు త్వరలో ‘కిసాన్​ క్రెడిట్​ కార్డు’లను ఇస్తామని చెప్పారు.  దేశంలో సముద్ర నాచు పెంపకానికి ప్రోత్సాహం ఇస్తామని, నాచు యూనిట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

శనివారం హైదరాబాద్​లోని జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్​ఎఫ్​డీబీ)కి వచ్చిన ఆయన.. పలు కార్యక్రమాలను ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మత్స్యకారులు, మహిళల అభివృద్ధి కోసం ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ (పీఎంఎంఎస్​వై) కింద ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సముద్ర నాచుకు మంచి మెడిసినల్​ గుణాలున్నాయని, నాచు పెంపకాన్ని మరింత ప్రోత్సహించేందుకు తమిళనాడులో సముద్రనాచు ఎకనామిక్​ పార్క్​ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తర్వాత దేశమంతటా వాటిని ఏర్పాటు చేస్తామన్నారు.

మంచినీటి రొయ్యల పెంపకం కోసం బిహార్​లో డాక్టర్​ రాజేంద్ర ప్రసాద్​ సెంట్రల్​ అగ్రికల్చర్​ యూనివర్సిటీలోని కాలేజ్​ ఆఫ్​ ఫిషరీస్​ ఏర్పాటు చేసిన హేచరీని ఆయన వర్చువల్​గా ప్రారంభించారు. మత్స్యకారులు, ఆక్వా రైతులకు పీఎంఎంఎస్​వై మీద అవగాహన కల్పించేందుకు పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు.