కొండగట్టులో యువకుడు దారుణ హత్య.. ప్రాణాలతోనే గోతిలో పాతిపెట్టిన దుండగులు

కొండగట్టులో యువకుడు దారుణ హత్య.. ప్రాణాలతోనే గోతిలో పాతిపెట్టిన దుండగులు

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రాణాలతోనే  యువకుడిని గోతిలో పెట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పు రమణ రెడ్డి అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. దీంతో అతడి సోదరుడు నిరంజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిరంజన్ ఫిర్యాదు ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయం బయటపడింది. 

పాత కక్షల నేపథ్యంలో జూన్ 2వ తేదీన రమణారెడ్డిని తీవ్రంగా చితకబాది ప్రాణాలతోనే భూమిలో పాతి పెట్టారు దుండగులు. కొండగట్టు గుట్ట పైకి వెళ్లే మెట్ల దారి పక్కన ఉపాధి హామీ కోసం తీసిన గుంతలో పాతిపెట్టారు. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ఆదివారం (జూన్ 8) ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు.

పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నెల 2వ తేదీన హత్య చేసి పాతిపెట్టినట్లు స్థానిక సీఐ నీలం రవి తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 8 మంది కలిసి హత్య చేసినట్లు ఆయన వెల్లడించారు. నిందితుల్లో పలువురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు.