చేప ప్రసాదం పంపిణీలో అపశ్రుతి.. క్యూ లైన్లో నిలబడిన వృద్ధుడు హార్ట్ స్ట్రోక్తో మృతి

చేప ప్రసాదం పంపిణీలో అపశ్రుతి.. క్యూ లైన్లో  నిలబడిన వృద్ధుడు హార్ట్ స్ట్రోక్తో మృతి

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకి చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ప్రసాదం తీసుకునేందుకు క్యూ లైన్లో నిలబడిన వృద్ధుడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. స్పృహ తప్పి పడిపోయిన వృద్ధుడికి సీపీఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వృద్ధుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు చేప మందు కోసం వచ్చారు. ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి చేప మందు పంపిణీ వద్దకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 42 క్యూ లైన్లలో కౌంటర్లలో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అన్ని విభాగాలతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపల  అధికారులు ఆల్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని కౌంటర్ల వద్ద ప్రత్యేక పోలీసు భద్రత ఉంది. ఉదయం 9 గంటలకు చేప మందు పంపిణీ ప్రారంభం కాగా సాయంత్రానికి 70 వేల మంది చేప ప్రసాదాన్ని తీసుకున్నారు.