Maganti Gopinath: మాగంటి గోపీనాథ్కు కడసారి వీడ్కోలు.. అంతిమ యాత్ర సాగిందిలా..

Maganti Gopinath: మాగంటి గోపీనాథ్కు కడసారి వీడ్కోలు.. అంతిమ యాత్ర సాగిందిలా..

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్యెల్యే మాగంటి గోపినాథ్ అంతిమయాత్ర మాదాపూర్ లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమై మహా ప్రస్థానం వద్ద ముగిసింది. మాదాపూర్ నీరూస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్ నగర్ మీదుగా అంతిమ యాత్ర సాగింది. అంతిమ యాత్రలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాగంటి అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి మాగంటి గోపీనాథ్కు కడసారి వీడ్కోలు పలికారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాలకు మృతి చెందిన సంగతి తెలిసిందే.

జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని చూసిన కేసీఆర్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు.

జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. తనను కాపాడుకునేందుకు వైద్యులు  చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.