షియా ముస్లింలకు ఎమ్మెల్సీ ఇవ్వాలి..షియా ముస్లిం కౌన్సిల్‌ డిమాండ్‌

షియా ముస్లింలకు ఎమ్మెల్సీ ఇవ్వాలి..షియా ముస్లిం కౌన్సిల్‌ డిమాండ్‌

ఖైరతాబాద్‌, వెలుగు: సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం షియా ముస్లింలకు గవర్నర్‌ కోటా (సామాజిక సేవ)లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని షియా ముస్లిం కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది. ఆదివారం లక్డీకాపూల్‌లోని సంస్థ ఆఫీసులో షియా సివిల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహ్మద్‌ అలీ హైదర్‌ను ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం సంస్థ చైర్మన్‌, డైరెక్టర్‌ షబ్బీర్‌ అలీ మీర్జా, జాతీయ అధ్యక్షుడు హిదాయత్‌ అలీ మీర్జా, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అభ్యర్థి మహ్మద్‌ అలీ హైదర్‌ మాట్లాడారు.  

తెలంగాణలో 10.50 లక్షల మంది షియా ముస్లింలు ఉన్నారన్నారు.  రాజ్యాంగపరంగా తమకు రావాల్సిన హక్కులు దక్కడం లేదన్నారు. ఆర్టికల్‌ 171 (5) కింద అర్హత కలిగిన అభ్యర్థి ఎమ్మెల్సీ పదవికి దరఖాస్తు చేసినా, నిర్లక్ష్యం చేయడంపై హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పులు వచ్చాయన్నారు. రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వగా, రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారన్నారు. ఈ విషయమై గవర్నర్‌ను కలిశామని, తీర్పు ప్రతులతో మరోమారు కలుస్తామన్నారు. తమ వర్గానికి అవసరమైన శ్మశాన స్థలాలు లేవని, ప్రత్యేక విద్యాసంస్థలు, హాస్టళ్లు ఏర్పాటు చేయాలని, కర్బలా హౌజ్‌లు, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ వారసత్వ ఆస్తుల పరిరక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.