తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీర్మాన్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 ఎన్నికలే లక్ష్యంగా బీసీలు రాజకీయంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్తో భువనగిరిలో జరిగిన రాజ్యాధికార సమర భేరి సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలందరూ ఏకమై ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
డాక్టర్ బిక్షపతి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో చేరడం అభినందనీయమని అన్నారు. రాయగిరి రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీ యువతకు 42 శాతం ఉద్యోగాలు రావాలని డిమాండ్ చేశారు.
పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ప్రస్తావిస్తూ, దొరల భూములను పేదలకు అందించడమే రాజ్యాధికార పార్టీ లక్ష్యమని చెప్పారు. భువనగిరి నియోజకవర్గంలో 19 వేల మంది రెడ్లు ఉండగా, లక్షా 60 వేల మంది బీసీలు ఉన్నారని అయినా రాజకీయంగా వెనకబడి ఉన్నారన్నారు.
►ALSO READ | బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టుల్లో నీటిని నిల్వచేస్తే బ్యారేజీలే కొట్టుకుపోతాయి: మంత్రి ఉత్తమ్
భువనగిరి, మునుగోడు, పెద్దపల్లి, నల్లగొండ ప్రాంతాల్లో గత 58 ఏళ్లుగా రెడ్లే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారని, 2028 ఎన్నికల్లో బీసీలు ఎమ్మెల్యేలుగా గెలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం 59 మంది ఆధిపత్య కులాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు.
సర్జికల్ స్ట్రైక్-59పేరుతో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని, అసెంబ్లీని బీసీ ప్రజాప్రతినిధులతో నింపడమే తమ లక్ష్యమని అన్నారు. మరో 884 రోజుల్లో బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతారని, ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలకడమే తమ లక్ష్యమని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.
