సియా‭దే ఈ పాపం.. కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం

సియా‭దే ఈ పాపం.. కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం

ముంబై: సియా గోయల్ చేతిలో దారుణ హత్యకు గురైన కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కేతన్ అగర్వాల్ తాత దేవీచంద్ అగర్వాల్ పూణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

ఆయన కొడుకు విశాల్ అగర్వాల్.. సోషల్ మీడియాలో "మిస్ యూ డాడ్" అంటూ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. దేవీచంద్కు మేజర్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈ మధ్య జరిగిన పరిణామాలు ఆయనను బాధించాయి. మనవడి జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిందని తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.

ఈ క్రమంలో.. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను పుణెలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఇలా రెండు నెలలలోనే వరుస విషాదాలు కేతన్ అగర్వాల్ కుటుంబాన్ని వెంటాడాయి. కేతన్ అగర్వాల్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సియా గోయల్ ప్రత్యక్షంగా కేతన్ అగర్వాల్ను, పరోక్షంగా అతని తాతయ్యను పొట్టనపెట్టుకుందని ఈ పరిణామంపై నెటిజన్లు స్పందించారు.

►ALSO READ | ఘోరం.. భార్యను కాపురానికి రమ్మని అడగటానికి వెళ్లి.. బామ్మర్ది చేతుల్లో కాలి బూడిదయ్యాడు.. వీడియో వైరల్

పుణెకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి విశాల్ అగర్వాల్ కుమారుడు కేతన్ అగర్వాల్‌‌కు, సియా గోయల్​తో వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది నవంబర్‌‌‌‌లో పెండ్లి జరగాల్సి ఉంది. జూన్ 18న సియా గోయల్ పుట్టినరోజు సందర్భంగా సియా, కేతన్ కలిసి లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్‌‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే కోటపై ఫొటోలకు పోజులు ఇస్తుండగా కేతన్ కాలుజారి లోయలో పడిపోయాడు. ఇది ఆమె అందరికీ చెప్పిన కట్టు కథ. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌‌ మూడు గంటల పాటు శ్రమించి లోయ నుంచి కేతన్ మృతదేహాన్ని వెలికితీసింది. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసును నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా సియాను ప్రశ్నించగా పొంతనలేని జవాబులిచ్చింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. నిందితురాలి మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్, స్పాట్‌‌లో ఉన్న మరికొందరి స్టేట్‌‌మెంట్లను సేకరించగా అసలు నిజం బయటపడింది. కేతన్‌‌ను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేసిన సియా, తన పుట్టినరోజు నెపంతో అతడిని లోహగఢ్ కోటకు పిలిపించింది. అక్కడ సమయం చూసి ప్రియుడు చేతన్ సహాయంతో కేతన్‌‌ను లోయలోకి నెట్టేసింది.