
- కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారంపై ఎల్జీపీ అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తాజాగా స్పందించారు. సీఎం సీటుపై చిరాగ్ పాశ్వాన్ దృష్టి పడిందని, అందుకోసమే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఎన్డీయే కూటమిలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. శనివారం పాట్నాలో చిరాగ్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై పార్టీలో సమాలోచనలు జరుగుతున్నాయని అన్నారు.
నేను ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది. ఒకవేళ నేను పోటీ చేసినా కూడా అది పార్టీ స్ట్రైక్ రేట్ పెంచడం కోసమే తప్ప సీఎం పదవి కోసం కాదు. సీఎం పదవిపై నా దృష్టి పడిందంటూ ఎన్డీయే కూటమిలో ప్రచారం జరగడం విచారకరం. అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తే ఎన్డీయే కూటమికీ లాభమే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీలు పోటీ చేయడం అసాధారణమేమీ కాదు. బీజేపీ కూడా గతంలో చాలామంది ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపింది” అని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు.