నా డ్యూటీ టైమ్‌ అయిపోయింది.. నేను విమానం నడప

నా డ్యూటీ టైమ్‌ అయిపోయింది..  నేను విమానం నడప
  • మహా డిప్యూటీ సీఎం షిండే ఫ్లైట్ నడపనని మొండికేసిన పైలట్‌
  • దాదాపు 45 నిమిషాల పాటు బతిమిలాడుకున్న తర్వాత 
  • టేకాఫ్‌ అయిన విమానం

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన విమానం గంట సేపు నిలిచిపోయింది. తన డ్యూటీ టైమ్ అయిపోయిందని, తాను ఫ్లైట్‌ నడపనని పైలెట్‌ మొండికేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. రాష్ట్రంలోని ముక్తాయ్‌ నగర్‌‌లోని సంత్‌ ముక్తాయ్‌లో పల్లకి యాత్రలో పాల్గొనేందుకు శనివారం డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే ముంబై నుంచి జల్గావ్‌కు వచ్చారు. వాస్తవానికి 3.45 నిమిషాలకు ఆయన జల్గావ్‌లో ఉండాలి. 

అయితే, కొన్ని టెక్నికల్‌ కారణాల వల్ల ఆయన రెండున్నర గంటలు ఆలస్యంగా రోడ్డు మార్గం గుండా ముక్తాయ్‌నగర్‌‌కు చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు గిరీశ్‌ మహాజన్, గులాబ్‌ రావ్‌ పాటిల్‌, మరికొంత మంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు. పల్లకీ యాత్రలో పాల్గొన్న అనంతరం సంత్‌ ముక్తాయ్‌ టెంపుల్‌ను షిండే సందర్శించారు. అనంతరం రాత్రి 9.15 గంటలకు జల్గావ్‌ ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నారు. అయితే, తన డ్యూటీ టైమ్‌ అయిపోయిందని, తాను ఫ్లైట్‌ నడపలేనని అధికారులకు ఆ పైలెట్‌ స్పష్టం చేశాడు. 

దీంతో వారు షాక్‌ అయ్యారు. ఈ క్రమంలో షిండేతో పాటు వచ్చిన మంత్రులు, అధికారులు ఆ పైలెట్‌ను బతిమిలాడారు. చివరికి దాదాపు 45 నిమిషాల తర్వాత ఫ్లైట్‌ టేకాఫ్‌ చేయడానికి అతను ఒప్పుకున్నాడు. అలాగే, ఫ్లైట్‌ వెళ్లేందుకు క్లియరెన్స్‌ ఇవ్వాలని మంత్రి మహాజన్‌ సంబంధిత అధికారులతో మాట్లాడటంతో జల్గావ్‌ ఏయిర్‌‌పోర్ట్‌ నుంచి షిండే ఫ్లైట్‌ ముంబైకి టేకాఫ్‌ అయింది. పైలెట్‌కు ఆరోగ్యం బాగోలేదని, దీంతోనే అతను ఫ్లైట్‌ నడపనని చెప్పాడని మహాజన్‌ తెలిపారు. ఎయిర్‌‌లైన్‌ కంపెనీతో మాట్లాడి ఇక్కడి పరిస్థితి గురించి వివరించామని చెప్పారు. ఇది చాలా చిన్న సమస్య అని ఆయన పేర్కొన్నారు. 

కిడ్నీ పేషెంట్‌కు షిండే లిఫ్ట్‌..

సర్జరీ కోసం అర్జెంట్‌గా ముంబైకి వెళ్లాల్సిన ఓ మహిళా కిడ్నీ పేషెంట్‌కు ఏక్‌నాథ్‌ షిండే తన ఫ్లైట్‌లో లిఫ్ట్‌ ఇచ్చారు. ముంబైకి వెళ్లాల్సిన వారి ఫ్లైట్‌ మిస్ కావడంతో ఆయన హెల్ప్‌ చేశారు. శీతల్‌ పాటిల్‌ అనే మహిళా తన భర్తతో కలిసి ముంబైకి వెళ్లాలి. అయితే, వారు వెళ్లాల్సిన విమానం అప్పటికే వెళ్లిపోయింది. షిండేకు వారి గురించి తెలియడంతో ఆ దంపతులకు ఆయన తన ఫ్లైట్‌లో లిఫ్ట్‌ ఇచ్చారు. అంతేకాకుండా వారు హాస్పిటల్‌కు వెళ్లేందుకు ముంబై ఎయిర్‌‌పోర్టులో ప్రత్యేకంగా అంబులెన్స్‌ను కూడా ఆయన ఏర్పాటు చేశారు.