
లీడ్స్ (ఇంగ్లండ్): ఇండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్.. యార్క్షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. కౌంటీ చాంపియన్షిప్ డివిజన్ వన్లో ఐదు మ్యాచ్లతో పాటు వన్డే కప్లోనూ బరిలోకి దిగనున్నాడు. జులైలో స్కార్బరోలో సర్రేతో జరిగే కౌంటీ మ్యాచ్కు రుతురాజ్ యార్క్షైర్ జట్టుతో కలుస్తాడని యార్క్షైర్ వెల్లడించింది. సీజన్ ముగిసే వరకు అతను జట్టులోనే ఉంటాడని వెల్లడించింది. ప్రస్తుతం ఇండియా–ఎ జట్టు తరఫున ఇంగ్లండ్లో పర్యటిస్తున్న రుతురాజ్.. ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికార టెస్ట్లు ఆడాడు. ఈ నెల 13 నుంచి 16 వరకు సీనియర్ జట్టుతో కలిసి బెకెన్హామ్లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనున్నాడు.
‘ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు, రంజీ ట్రోఫీలో మహారాష్ట్రకు కెప్టెన్గా ఉన్న పుణె లోకల్ ప్లేయర్ రుతురాజ్ మా తరఫున కౌంటీ మ్యాచ్లు ఆడనున్నాడు. ఇండియా తరఫున ఆరు వన్డేలు, 23 టీ20లు ఆడిన మంచి బ్యాటర్’ అని యార్క్షైర్ వెబ్సైట్లో పొందుపర్చింది. ఇంగ్లండ్లో క్రికెట్ను ఎక్స్పీరియెన్స్ చేయడం తన లక్ష్యమని రుతురాజ్ అన్నాడు. ఇక్కడ యార్క్షైర్ కంటే మరో పెద్ద క్లబ్ లేదన్నాడు. కౌంటీ చాంపియన్షిప్లో తమకు కొన్ని కీలకమైన మార్పులు ఉన్నాయని, వన్డే కప్ నెగ్గడానికి ఇదో మంచి అవకాశమని యార్క్షైర్ కోచ్ ఆంథోనీ మెక్గ్రాత్ గైక్వార్డ్ పేర్కొన్నాడు. తమ బ్యాటింగ్ లైనప్కు మరింత బలం వస్తుందన్నాడు. ఇప్పటివరకు ఒక విజయం, నాలుగు ఓటములు, రెండు డ్రాలతో 10 పాయింట్లతో ఉన్న యార్క్షైర్.. డివిజన్ వన్ పాయింట్ల పట్టికలో చివరి ప్లేస్లో ఉంది.