Sachin Tendulkar: క్రికెట్ దేవుడికి అయోధ్య రాముని ఆహ్వానం

Sachin Tendulkar: క్రికెట్ దేవుడికి అయోధ్య రాముని ఆహ్వానం

అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనుండగా.. ఈ కార్యక్రమం కోసం యావత్‌ భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇదిలావుంటే, ఈ రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఆహ్వానం అందింది.

దేశవ్యాప్తంగా వివిధరంగాలకు చెందిన సుమారు 10వేల మందికి పైగా ప్రముఖులకు రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర హీరోలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు అతని తనయుడు రామ్ చరణ్, ప్రభాస్, మోహన్ బాబు, అక్కినేని నాగార్జున వంటి పలువురు హీరోలకు అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలిరావొచ్చని రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తోంది.