
చాంగ్జౌ: ఇండియా యంగ్ షట్లర్ ఉన్నతి హుడా.. తన కెరీర్లోనే గుర్తుండిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. చైనా ఓపెన్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో 17 ఏండ్ల ఉన్నతి 21–16, 19–21, 21–13తో స్టార్ షట్లర్ పీవీ సింధుపై గెలిచింది. ఫలితంగా సూపర్1000 టోర్నీలో తొలిసారి క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది.
ఓ ఇంటర్నేషనల్ టోర్నీలో సింధు.. తన తోటి ప్లేయర్ చేతిలో ఓడటం ఏడేండ్ల తర్వాత ఇదే మొదటిసారి. 73 నిమిషాల మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్లు బలమైన స్మాష్లు, సుదీర్ఘమైన ర్యాలీలు, క్రాస్ కోర్టు విన్నర్లు సంధించడంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. అయితే వెనకబడిన ప్రతిసారి ఉన్నతి ధైర్యంగా ఆడటం మ్యాచ్ను తనవైపు తిప్పింది. చెరో గేమ్ నెగ్గినా.. డిసైడర్ మాత్రం ఏకపక్షంగా సాగింది.
6–5 లీడ్లో ఉన్న ఉన్నతి ఏ దశలోనూ వెనుదిరిగి చూసుకోలేదు. వరుస పాయింట్లతో 16–12తో నిలిచింది. ఈ టైమ్లో సింధు ఒక పాయింట్ నెగ్గినా.. ఉన్నతి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి చిరస్మరణీయ విజయం సొంతం చేసుకుంది. మెన్స్ సింగిల్స్లో హెచ్.ఎస్. ప్రణయ్ 21–18, 15–21, 8–21తో చో టియాన్ చెన్ (చైనీస్తైపీ) చేతిలో ఓడాడు. మెన్స్ డబుల్స్లో సాత్విక్–చిరాగ్ షెట్టి 21–19, 21–19తో లియో కర్నాండో–బగాస్ మౌలానా (ఇండోనేసియా)పై నెగ్గి క్వార్టర్స్ చేరింది.